
జవాబు: ఏ ప్రాంతంలోనైనా వర్షం కురిస్తే ఆ ప్రాంతంలోని సమతలంపై నీరు ఎంత ఎత్తుకు చేరుకుంటుందో ఆ మట్టం ఆధారంగా అక్కడ కురిసన వర్షపాతాన్ని కొలుస్తారు. ఉదాహరణకు విజయవాడలో 10 మిల్లీమీటర్ల వర్షం నమోదైందంటే అక్కడి సమతలంపై నిలిచిన నీటి ఎత్తు 10 మి.మీ. అన్నమాట. కానీ ఒక స్థలంలో నీరు ఎంత ఎత్తున నిలబడిందనే విషయాన్ని నేల మీద నుంచి కొలవడం సాధ్యం కాదు. అందువల్ల వర్షపాతాన్ని వర్షమాపకం (Rain Gauge) అనే పరికరంతో కొలుస్తారు.
వర్షమాపకంలో ఫైబర్గ్లాస్తో కానీ, లోహంతో కానీ చేసిన 10 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక గరాటు (ఫన్నల్) ఉంటుంది. ఈ గరాటు ఒక లీటరు ఘనపరిమాణంగల సీసా మూతకు బిగించి ఉంటుంది. గరాటు ద్వారా సీసాలో పడిన వర్షపు నీటి ఘనపరిమాణాన్ని కొలవడానికి ఒక కొలజాడీ (measuring jar)ఉంటుంది. చెట్లు, కొండలు లేని మైదానంలో సమతలంగా ఉన్న నేలపై 30 సెంటీమీటర్ల ఎత్తులో వర్షమాపకాన్ని అమరుస్తారు. ఆ ప్రదేశంలో వర్షం పడినప్పుడు నీరు వర్షమాపకంలోని గరాటు ద్వారా సీసాలో పడి కొంత ఎత్తులో నిలబడుతుంది. అలా సేకరించిన నీటి ఘనపరిమాణాన్ని కొలజాడీలో కొలిచి ఆ ప్రదేశంలోని వర్షపాతాన్ని లెక్కగడతారు.
వాతావరణ పరిశోధన కేంద్రాలలోని వర్షమాపకం ఒక సన్నని గొట్టంలా ఉంటుంది. ఆ గొట్టంపై ముందుగానే పై పద్ధతిని ఉపయోగించి కొలతలు గుర్తించి ఉంటాయి. అందులోకి చేరిన నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని నేరుగా మిల్లీమీటర్లలో కొలుస్తారు.
వర్షాన్ని అలా కొలుస్తారేం?
ప్రశ్న: ద్రవాలను లీటర్లలో కొలుస్తారు కదా, మరి వర్షపాతాన్ని ఎందుకు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తారు?
-కేబీటీ సుందరి, సికింద్రాబాద్
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===============================
