- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్రశ్న: భూమి గుండ్రంగా ఉండి పడమర నుంచి తూర్పునకు వేగంగా తిరుగుతోంది కదా! మరి మనం పడిపోమెందుకు?
జవాబు: భూమి తన చుట్టూ తాను గంటకు 1620 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. కానీ ఆ చలనం మనకు కొంచెం కూడా తెలియదు.కారణంభూమిసమవేగంతో(uniform)తిరగడమే. మనం సమవేగంతో సరళమార్గంలో వెళుతున్న రైలుబండిలో ఉన్నామనుకోండి. బయటి దృశ్యాలు కనిపించకుండా బోగీల తలుపులు, కిటికీలు మూసేసి కూర్చుంటే అది కదులుతోందో లేదో కనిపెట్టలేము. ఆగి ఉన్న రైలుకు, సమవేగంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలుకు తేడా ఏమీ ఉండదు. అయితే రైలు సరళమార్గం నుంచి మలుపు తిరిగితే మాత్రం మన శరీరం పక్కకు ఒరగడం వల్ల రైలు గమనాన్ని అనుభూతి చెందగలం.
తన చుట్టూ తాను తిరిగే భూమి కదలిక సమంగా, ఒడిదుడుకులు లేకుండా నిరంతరాయంగా ఉండడం వల్ల మనకు దాని చలనం మనకు అనుభవంలోకి రాదు. భూమి సమవేగంతో పయనిస్తున్నా, సరళమార్గంలో కాకుండా వంపుగా ఉన్న మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా మనం ఆ వంపుగా ఉండే కేంద్రం నుంచి దూరంగా పడాలి కానీ అలా జరగడం లేదు. దానికి కారణం భూమి పరిమాణమే. భూమి ఎంత పెద్దగా ఉంటుందంటే, దాని పరిభ్రమణంలోని వంపు ఒక్కసారిగా, తటాలున మారకుండా క్రమేపీ కొంచెం కొంచెంగా మారుతుంది. ఆ మలుపు చాలా వరకు సరళ మార్గంలోనే ఉంటుంది. అందువల్ల మనపై పనిచేసే బాహ్యబలం అత్యంత స్వల్పంగా ఉంటుంది. కాబట్టే భూమి పరిభ్రమిస్తున్నా, మనం కిందపడం.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ========================================
