ప్రశ్న: ప్రాచీన కాలంలో భూగర్భంలో ఖనిజాలు, వాయువులు సహజ వనరులను ఎలా కనుగొనేవారు?
జవాబు: నేడు విద్యుద్రసాయనిక పరికరాలు (electro chemical devices), అతి శబ్ద తరంగ సాధనాలు (ultra sonic wave devices) రేడియోధార్మిక డేటింగ్ గ్రాహకాలు మొదలైన ఆధునిక పరికరాలతో భూగర్భంలో ఉన్న సహజ వాయువుల నిక్షేపాలు, ఖనిజ సంపద, నీటి నిల్వలు, ప్రాచీన కట్టడాల ఆనవాళ్లు తెలుసుకోగలుగుతున్నాం.
కానీ ప్రాచీన కాలంలో ఈ విధమైన సాధనాలు, అవకాశాలు ఉండేవి కావు. కేవలం వర్షపు నీరు ఎండిపోయే విధానాన్ని బట్టి నేలలోని భౌతిక రసాయనిక ధర్మాల్ని ఉజ్జాయింపుగా గుర్తించేవారు. అలాగే ఏవైనా భూకంపాలు సంభవించినపుడు ఆ నేల పగుళ్ల నుంచి వచ్చే వాయువుల వాసనల్ని, ద్రవాల ధర్మాల్ని బట్టి కొద్దో గొప్పో నేలలోని నిక్షేపాల్ని అవగాహన చేసుకునేవారు. స్వానుభవం ద్వారా, తరతరాల వైజ్ఞానిక పరిజ్ఞానపు పరంపర ద్వారా వనరుల్ని తెలుసుకునేవారు. మైదాన ప్రాంతాలు, నదీ తీరాలు, అటవీ, పర్వత ప్రాంతాలు రాతి నేలలు మొదలైన బాహ్య రూపాల వల్ల ఆయా నేలల్లో ఉన్న వనరుల గురించి అవగాహన ఉండేది. విజ్ఞానం ఎప్పుడూ ఉన్నఫళంగా రాదు. నేటి ఆధునిక విజ్ఞాన వృక్షానికి మానవ సమాజంలో ప్రాచీన కాలంలో కూడా బీజాలున్నాయని మనం అర్థం చేసుకోవాలి.
- - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్,--వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==============================
