ప్రశ్న: గోరింటాకు పెట్టుకున్నాక ఆ వేళ్లను పంచదార నీళ్లు, లేదా నిమ్మరసం పిండిన నీళ్లలో కాసేపు ఉంచితే గోరింటాకు బాగా పండుతుంది. ఎందుకని?
-కె. అభిషిక్త, తాడేపల్లిగూడెం
జవాబు: గోరింటాకులోని కొన్ని వర్ణ ద్రవ్యాలు గోళ్ల లోని కెరోటిన్ అనే ప్రత్యేకమైన ప్రొటీన్తో రసాయనికంగా బంధించుకుంటాయి. అక్కడ అణునిర్మాణంలో మార్పులు రావడం వల్ల ఆ సమ్మేళనాల కాంతి ధర్మాలు (optical properties) మారిపోయి ఎరుపు రంగును ప్రదర్శిస్తాయి. అందుకే గోరింటాకు పూసుకున్న చోట ఎర్రగా కనిపిస్తుంది. గోరింటాకు పెట్టుకున్న చేతులను చక్కెర నీళ్లలోను, నిమ్మరసం పిండిన నీళ్లలోను ఉంచినప్పుడు రెండు కారణాల వల్ల ఇది మరింతగా స్థిరపడుతుంది. చక్కెర, నిమ్మరసం నీళ్ల వల్ల చర్మపు పొరలు బాగా వదులుగా అయి, చర్మం మెత్తపడుతుంది. దాని వల్ల గోరింటాకు వర్ణద్రవ్యపు అణువులు మరింత లోతుగా చర్మంలోకి ఇంకుతాయి. అలాగే వర్ణద్రవ్యాలలోని హైడ్రోజన్ అయాను చలనాన్ని ఈ ద్రావణాలు ప్రభావితం చేస్తాయి. దీన్నే బఫరింగ్(buffering) అంటారు. అందువల్ల ఆ వర్ణద్రవ్యాలు మరింత ఎరుపు రంగును వెదజల్లే అణ్వాకృతి (molecular orientation) ను పొందుతాయి.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ====================================
