ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: నీరు ఘనీభవిస్తే అణువులు దగ్గరకు చేరి దాని ఘన పరిమాణం తగ్గాలి కదా! కానీ పెరుగుతుంది. ఎందువలన?
జవాబు: నీరు h2o అనే మూడు పరమాణువులతో కూడిన అణువు. నీరు ద్రవ స్థితిలో ఉండడం అంటే అర్థం అందులోని అణువులన్నీ పరస్పరం విద్యుదాకర్షణ ద్వారా, హైడ్రోజన్ బంధాల ద్వారా దగ్గరగా ఉండడమనుకోవచ్చు. ఈ స్థితిలో ఈ అణువులకు దిశ, క్రమత్వం ఉండదు. చిందరవందరగా తిరుగుతూ ఉన్నా కూడా వాటి మధ్య ఉన్న పరస్పర సగటు దూరం తక్కువగానే ఉంటుంది. దీన్ని మనం బడిలో ఉన్న విద్యార్థులందరూ దగ్గరగా వచ్చి గుమిగూడినట్టు అనుకోవచ్చు. అప్పుడు తక్కువ వైశాల్యంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు. నీరు ఘనీభవించినప్పుడు అణువుల మధ్య కేవలం దిశ, క్రమత్వం ఉన్న హైడ్రోజన్ బంధాలు అమల్లోకి వస్తాయి. కాబట్టి అణువుల మధ్య దూరం కొద్దిగా పెరుగుతుంది. దీన్ని మనం ఇంతకు ముందు అనుకున్న విద్యార్థుల గుంపే డ్రిల్లులో చేతులు చాచి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నిల్చున్నట్టు వూహించండి. అప్పుడు వాళ్లంతా ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమిస్తారు కదా? నీరు ద్రవస్థితిలో ఉన్నప్పుడు, ఘనీభవించినప్పుడు ఇలాంటి బంధాల వ్యత్యాసం వల్లే నీటి సాంద్రత మంచు గడ్డ సాంద్రత కన్నా ఎక్కువగా ఉంటుంది.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్, రాష్ట్రకమిటి, జనవిజ్ఞానవేదిక
- =========================
