ప్రశ్న: విమానాలు ఆకాశంలో ఎగురుతున్నపుడు వాటి మీద పిడుగులు పడవా?
జవాబు: విమానాలు గాలిలో ఎగురుతున్నపుడుగానీ నేలమీద ఉన్నపుడుగానీ వాటిని పిడుగులు సాధారణంగా ఏమీచేయలేవు.
పిడుగు అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ విషయం బోధపడుతుంది. మేఘాల రాపిడితో ఉద్భవించిన అత్యధిక స్థిర విద్యుత్తు నేలవైపునకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నేలకు, విద్యుదావేశితాలయిన మేఘాలకు మధ్య వేల వోల్టుల మోతాదులో శక్మ భేదం (Potential difference) ఉంటుంది. రెండు బిందువుల మధ్య శక్మ భేదం ఉన్నట్లయితే విద్యుదావేశం అతి తక్కువ నిరోధం ఉన్న మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఆ విద్యుద్గమనం ఉష్ణ రూపంలో బయటపడుతుంది. అదే ప్రమాదాన్ని కలిగించే సంఘటన. కానీ విమానం కిందున్నపుడు విద్యుత్ప్రవాహాన్ని నిరోధించే రబ్బరు టైర్లు ఉంటాయి. మేఘాల్లో ఉన్నపుడు దాని ద్వారా భూమిని చేరే మార్గం మేఘాల్లోని విద్యుత్తుకు లేదు. అసలు విషయం మరోటి ఉంది. విమానం పైకి లేచిన కొన్ని నిముషాల్లోనే అది మేఘాల్ని దాటి పైకి వెళ్లి ప్రయానిస్తుంది. మెరుపులు ఉరుములు, పిడుగులు తన కింద ఎక్కడో సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి పిడుగు ప్రభావం విమానం పైన ఉండదు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
