ప్రశ్న: కిరోసిన్ దీపానికి పొగచూరుతుంది. క్యాండిల్ దీపానికి అలా కాదు. ఎందుకని?
జవాబు : కిరోసిన్, క్యాండిల్లో ఉండే మైనం రెండూ సేంద్రీయ పదార్థాలే (Organic compounds). ఇవి గాలిలో మండినప్పుడు అధిక మోతాదులో ఉష్ణశక్తి వెలువడుతుంది కాబట్టి వీటిని ఇంధనాలు (fuels) గా వాడుతున్నాము. కిరోసిన్ కన్నా మైనం స్వచ్ఛమైంది. కిరోసిన్లాంటి ద్రవ ఇంధనాల్లోని అణువులు గాలిలో తొందరగా చర్యనొందుతాయి. అందువల్లనే ఘనరూపమైన కొవ్వొత్తి కన్నా కిరోసిన్ తొందరగా మండడానికి ప్రయత్నిస్తుంది. అయితే గాలి పరిమాణం రెంటి విషయంలో ఒకే విధంగా ఉండడం వల్ల కిరోసిన్ మండేప్పుడు దాని దూకుడుకు అనువుగా ఆక్సిజన్ అందదు. అందువల్ల కిరోసిన్లో చాలా అణువులు పూర్తిగా మండకుండానే పాక్షికంగా దహనం చెంది శకలాలుగా బయటకి వస్తాయి. దీన్నే మనం మసి (soot) లేదా పొగ (smoke) అంటాము. కానీ మైనం మెల్లగా మండడం వల్ల ఎప్పటికప్పుడు తనక్కావలసిన పరిమిత స్థాయిలో ఆక్సిజన్ అందుతూ ఉంటుంది. కాబట్టి తక్కువ మసి ఏర్పడుతుంది. పూర్తిగా మసి లేని పరిస్థితి మాత్రం ఉండదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక
- =====================================
