ప్రశ్న: భూమి లోపల ఉండేదంతా ద్రవపదార్థమేనా?
జవాబు: భూమిని ఒక యాపిల్ పండు అనుకుంటే, ఆ పండు పై తొక్కతో, భూమి పైపొర (crust)ను పోల్చవచ్చు. ఈ పొర మందం సగటున దాదాపు 30 కిలోమీటర్లు ఉంటే, సముద్రాల కింద దాని మందం సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పైపొరపై సరాసరి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ పొరలో ఆక్సిజన్, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, సోడియం, పొటాషియం, ఇనుము ఉంటాయి. ఇదే మనం నుంచునే గట్టి నేల.
భూమిపై పొరకు దిగువన ఉండే ప్రాంతం భూఆవరణ (Mantle). ఇందులో అధిక భాగం ద్రవ రూపంలో ఉండే శిలలే. చిక్కటి పాకంలా ఉండే ఈ ద్రవాన్ని శిలాద్రవం అంటారు. ఈ ప్రాంతం భూమికి 40 కిలోమీటర్ల లోతు నుంచి 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత 1500 డిగ్రీల సెల్సియస్ నుంచి 3000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. దీనిలో ఆక్సిజన్ వాయువు, సిలికాన్, అల్యూమినియం, ఇనుప ఖనిజాలు ఉంటాయి.
భూమి లోపల 2900 కిలోమీటర్ల నుంచి భూకేంద్రం వరకు ఉండే ప్రాంతాన్ని భూమి అంతర్భాగం (core) అంటారు. ఈ మొత్తం ప్రాంతాన్ని రెండు భాగాలనుకుంటే, ఔటర్కోర్లో ఇనుము, నికెల్ ద్రవరూపంలో ఉంటాయి. ఇన్నర్కోర్లో కూడా ఇవి ద్రవరూపంలో ఉన్నప్పటికీ అక్కడి పీడనం భూమిపై ఉండే పీడనం కన్నా 3.5 మిలియన్ల రెట్లు అధికంగా ఉండడంతో ఘనరూపంలో ఉండే బంతిలాగా ఉంటాయి. ఇక్కడి ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలంలో ఉండే ఉష్ణోగ్రతకు సమానంగా 5000 నుంచి 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
Courtesy with Eenadu Hai bujji
- =========================
