ప్రశ్న: పాములు, బొద్దింకలు ప్రకృతిలో పర్యావరణానికి ఏ విధంగా దోహదకారులవుతున్నాయి?
జవాబు: ఈ విశాల విశ్వంలో మనకు తెలిసినంతవరకు భూమి తర్వాత మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు కానరాలేదు. భూమ్మీద జీవం ఆవిర్భవించి సుమారు 400 కోట్ల సంవత్సరాలైంది. ఎన్నో లక్షల రకాల వృక్ష జాతులు, వేలాదిగా జంతుజాతులు ఈ భూమ్మీద పరిణామం చెంది పర్యావరణానికి అనుకూలంగా ప్రకృతివరణం (Natural selection) ప్రకారం జీవనం సాగిస్తున్నాయి. పరస్పరం సహకరించుకుంటూ, ఘర్షించుకుంటూ, సహజీవనం సాగిస్తూ జీవావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయగలుగుతున్నాయి. ప్రకృతినెదిరించే సామర్థ్యం జంతువులకు, వృక్షాలకు లేదు. కానీ మానవుడికున్న తెలివి, అవసరాల కారణంగా ప్రకృతిని ఎదురించి, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఫలితంగా జీవ వైవిధ్యంలో తేడాలు సంభవిస్తున్నాయి. విపరీతమైన పట్టణీకరణ, జల ప్రణాళికల వల్ల ఎలుకలు, కప్పలు, పాములు, బొద్దింకలు పిచ్చుకలు, గాడిదలు, నక్కలు, రాబందులు, పులులవంటి పలు జంతువుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. బొద్దింకలు పలు రకాల మురికి పదార్థాలు తినికూడా బతుకుతాయి. ఒక అంచనా ప్రకారం అత్యంత స్వల్పంగా పరిణామం చెందిన అతి పురాతన జీవి బొద్దింక. ఎందుకంటే దాని జీవన విధానం ప్రకృతి ఆటుపోట్లను తట్టుకోగలగడమే కారణమంటున్నారు. పంటల్ని, ధాన్యాన్ని తినే ఎలుకల్ని భక్షించేవే పాములు. పాముల్లో ఎన్నో రకాలున్నా నేలమీద సంచరించే పాముల్లో మూడు మాత్రమే విషసర్పాలు. కానీ మనం అన్నింటినీ భయంతో చంపుతున్నాం. కానీ పాములు, బొద్దింకలు కూడా ప్రకృతికి అవసరమే.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ============================
