ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: కిళ్లీ నమిలిన తర్వాత నాలుక రంగు మారడానికి కారణం ఏమిటి?
జవాబు: కిళ్లీ అనేది ఓ మిశ్రణం (admixture). ఇందులో తమలపాకు, వక్క, సున్నం ప్రధాన దినుసులు. తమలపాకులో ఘాటు రుచికి కారణం అందులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వృక్ష రసాయనాలు (herbal chemicals). ఇందులో ప్రధానమైంది నికోటిన్ ఆమ్లం. తమలపాకులతో పాటు కిళ్లీలో వక్క (areca nut) వేసుకుంటాము. ఇందులో ప్రధానంగా వగరు లక్షణానికి కారణం అందులో ఉన్న ఎరికోలిన్ (arecoline)అనే ఆల్కలాయిడ్ క్షార రసాయనిక ధాతువు (ingredient). ఆకు, వక్కతో పాటు మనం సున్నం కూడా కొద్దిగా కలుపుకుంటాము. సున్నం కొంత ప్రధానంగా కాల్షియం హైడ్రోజన్ (ca(OH)2). ఇది బలమైన క్షారం. ఇలాంటి కిళ్లీని నోట్లో వేసుకున్నపుడు నోట్లో ఉన్న క్షారగుణం (alkaline)ఉన్న లాలాజలంతో ఈ ఆల్కలాయిడ్లో రసాయనిక నిర్మాణ మార్పు జరిగి ఎరుపు రంగుకు కారణమైన రూపంలో రసాయన బంధాలు పునర్నిర్మించుకుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం కిళ్లీలు తినడం ఆర్యోగానికి హానికరం.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక
- =====================
