- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఇసుక నదీగర్భాలలోను, సముద్ర తీరాలలోనే ఎందుకు దొరుకుతుంది? వేరే ప్రాంతాల్లో ఎందుకు లభ్యం కాదు?
జవాబు: ప్రతి ఇసుక రేణువు ముక్కలు చెక్కలైన పెద్ద బండరాళ్ల అవశేషంగా భావించాలి. నదీ ప్రవాహంలోను, సముద్రపు అలల వల్లను రాళ్లు పగిలిపోయి మొదటగా గుండ్రాళ్లుగా మారతాయి. అవి మరింతగా పగిలి చిన్న రాళ్లవుతాయి. ఇవి నీటి ఒరవడిలో కొట్టుకుపోతూ క్రమేణా అరిగిపోతూ ఉంటాయి. ఇలా ఇక ఏమాత్రం పగలలేని స్థితికి చేరుకున్నాయంటే ఇసుక రేణువులే అవుతాయి. ఇలా రాళ్లు నిరంతరం నీటి కదలికలకు, రాపిడి గురవడం ఎక్కువగా నదులు, సముద్రాల దగ్గరే జరుగుతుంది కాబట్టి ఆయా తీరాల్లోనే ఇసుక ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రదేశాల్లో విపరీతంగా వీచే గాలుల (hot wind blows) వల్ల కూడా బండరాళ్లు నిరంతరం ఒరిపిడికి గురవుతూ ఉంటాయి. ఏళ్ల తరబడి సాగే ఈ ప్రక్రియ ఎడారుల్లో ఉంటుంది. అందుకే అక్కడ కూడా ఎటు చూసినా ఇసుకే కనిపిస్తుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ======================
