ప్రశ్న: టీవీ పక్కన అయస్కాంతం ఉంచినప్పుడు తెరమీద రంగులు మారతాయి ఎందుకని?
- జె. శ్రీనివాస్, మిర్యాలగూడ
జవాబు: టీవీ తెర వెనుక భాగంలో పూతపూసిన ఫ్లోరసెంట్ పదార్థంపై ఎలక్ట్రాన్ల ధార వేగంగా పడడం వల్లనే తెరపై దృశ్యాలు ఏర్పడతాయి. అయితే కలర్ టీవీ తెర విషయంలో ఫ్లోరసెంట్ పదార్థం ఒకే తీరుగా ఉండదు. ఎలక్ట్రాన్లు పడ్డప్పుడు ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెదజల్లే మూడు బొడిపెలు (RBG) పక్కపక్కనే ఉంటాయి.ఈ మూడింటి సముదాయాన్ని కలిపి ఒక Pixel (Picture Element కు పొట్టిపేరు) అంటారు. కలర్ టీవీలో మూడు వేర్వేరు ఎలక్ట్రాన్ ధారలు వీటిని విడివిడిగా తాకేలా ఏర్పాటు ఉంటుంది. ప్రతి విడివిడి ఎలక్ట్రాను ఓ చిన్నపాటి అయస్కాంతమనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేరే అయస్కాంతాన్ని తెరకు దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఎలక్ట్రాన్ల ప్రవాహ మార్గాల్లో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడవి తాకవలసిన చుక్కల్ని కాక పక్కకి పడతాయన్నమాట. దాంతో రావలసిన రంగులకు బదులు వేరే రంగులు కనిపిస్తాయి. అయస్కాంతం తీయగానే తిరిగి దృశ్యాలు యధా ప్రకారం బాగా వస్తాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,నిట్, వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక.
- =============================
