ప్రశ్న: జనాభా లెక్కలను ఎందుకు సేకరిస్తారు? దాని వల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు: ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా లెక్కలను (census) సేకరిస్తాయి. మానవులు సమూహాలుగా నివసించడం మొదలైన దగ్గర్నుంచీ ఈ ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో రాజులు తమ పాలనలో ఉన్న ప్రజల్లో ఎంత మంది యుద్ధం చేయడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నారో తెలుసుకోడానికి, పన్నుల రూపంలో ఖజానాకు ఎంత ధనం సమకూరుతుందో అంచనా వేయడానికి జనాభా లెక్కలను సేకరించేవారు. ప్రస్తుత కాలంలో ఇందువల్ల ప్రభుత్వానికి విద్య, ఆరోగ్య, ఉద్యోగ సంబంధిత రంగాలలో ప్రణాళికలు వేయడానికి, ఒకో రంగానికి ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలుసుకోడానికి వీలవుతుంది. దేశంలో జనాభా పెరుగుతోందో, తగ్గుతోందో తెలుస్తుంది. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ఉండే ప్రజల నిష్పత్తి తెలుస్తుంది. ఎన్నికలలో ఎంత మంది ఓటర్లు పాల్గొంటారో తెలిస్తే ఆ మేరకు ఏర్పాటు చేయడానికి కుదురుతుంది. అలాగే ఆర్ధిక, సాంఘిక వ్యవస్థలను, శాంతిభద్రతలను మెరుగుపరిచే నిర్ణయాలను తీసుకోడానికి వీలవుతుంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలను సేకరించారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి లెక్కించడం ఆనవాయితీగా ఉంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===================================
