ప్రశ్న:కప్పలను పట్టుకొంటే జారిపోతాయెందుకు?
జవాబు: నీటిలోనే కాకుండా నేలపై చరించే కప్పవంటి ఉభయ చరాల శరీరాలపై ఉండే చర్మంపై పొర తడిగా, జిగురుగా పట్టుకొంటే జారిపోయే ధర్మం కలిగి ఉంటుంది. దీనివల్ల అవి వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి పొడిబారిపోకుండా ఉంటాయి. కప్ప శరీరంపై ఉండే చర్మం దృఢంగా ఉండకుండా పలుచగా ఉండడంతో ఆ చర్మానికి భాష్పీభవనం (evaporation) నుండి అంతగా రక్షణ లభించదు. దాంతో 25 శాతం నుంచి 30 శాతంకన్నా దేహంలోని ద్రవపదార్థాలు ఆవిరైతే అది జీవంతో ఉండలేదు. అందువల్ల కప్ప చర్మం నిరంతరం శ్లేష్మం (mucus)ను, ఇతర పదార్థాలను స్రవించే గ్రంధులను కలిగి ఉంటుంది. గ్రంధుల నుండి స్రవించే ఈ స్రావాలు కప్పదేహంలోని నీటిని సమతుల్యంలో ఉంచుతాయి. అలాగే ఆ స్రావాలలో ఉండే విషంతో కూడిన సమ్మేళనాలు కప్పలను వాటిని తినే ప్రాణుల నుండి, బాక్టీరియా, ఫంగస్ల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి. కప్పలు తమలో ఉండే గ్రంధుల ద్వారా సూర్యరశ్మి ప్రభావం తమ చర్మంపై పడకుండా ఒక తెరను కూడా ఏర్పరచుకోగలవు.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==============================
