ప్రశ్న: గాయాలను వైద్యులు హైడ్రోజన్ పెరాక్సైడుతో లేదా స్పిరిట్తో శుభ్రపరుస్తారు. ఎందుకు?
-సీఏ ఈశ్వర్, ఇంటర్, కరీంనగర్
జవాబు: గాయాలు తగిలినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స అది పుండుగా మారకుండా చూడడం. పుండు అంటే గాయం చేసిన దారి గుండా బయట ఉన్న సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందడమే. అలా అవి చొరబడకుండా చూడడానికి, అప్పటికే గాయంపై చేరిన వాటిని నాశనం చేయడానికి కొన్ని రసాయనాలతో శుభ్రపరుస్తారు. సాధారణంగా ఏకకణ జీవులుగా ఉండే సూక్ష్మజీవులు తమ కణాల్లోంచి నీరు పోయినా, ఆ కణద్రవంలో ఉన్న జీవరసాయనాలు చెదిరిపోయినా బతకలేవు. హైడ్రోజన్ పెరాక్సైడుతో గాయాలను కడిగినప్పుడు అది విచ్ఛిత్తి చెందడం ద్వారా వెలువడే ఆక్సిజన్ సూక్ష్మజీవుల జీవరసాయనాలతో చర్య జరిపి, వాటిని పనిచేయకుండా చేస్తుంది. అలాగే స్పిరిట్లో ప్రధానంగా ఉండే ఆల్కహాలు గాయాల దగ్గరున్న నీటిని, సూక్ష్మజీవుల జీవరసాయనాలను లాగేసి వాటి అభివృద్ధిని నాశనం చేస్తుంది తద్వారా సూక్ష్మజీవులు చస్తాయి.
-ప్రొ .ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ,-జనవిజ్ఞానవేదిక.
- ============================================
