Sunday, March 13, 2011

ఆకాశములో కాంతిపుంజాల కథేంటి?,Waht is the story of that light in the sky?





ప్రశ్న: వాతావరణంలో ఒకోసారి ఉన్నట్టుండి వెలుతురుతో కూడిన కాంతిపుంజాలు కనబడుతూ ఉంటాయి. దీనికి కారణం దైవమహిమా? మరేదైనా కారణమా?


జవాబు: ఉన్నట్టుండి ఇలా కాంతి వెలువడే సందర్భాలు రకరకాల కారణాల వల్ల ఏర్పడుతాయి. ఉదాహరణకి జనవరి నుంచి మార్చి వరకు భూమిపై ఏటవాలుగా పడే సూర్యకాంతిలో అతినీల లోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి సోకినప్పుడు గాలి కణాలలోని పరమాణువులు అయినీకరణం (Ionisation) చెందుతాయి. అంటే ఈ పరమాణువులు ఉత్తేజితమై ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలో కాంతి వెలువడుతుంది. అవే కాంతి పుంజాలుగా కనిపిస్తాయి. తగిన పరిస్థితుల్లో ఇది పగటి వేళల్లో జరిగే భౌతిక చర్యే. అలాగే ఒకోసారి శ్మశానాల్లో మంటలు ఎగురుతూ కనిపిస్తే వాటిని కొరివిదెయ్యాలుగా చెబుతుంటారు. నిజానికి అక్కడి ఎముకల్లో ఉండే భాస్వరం (Phosphorus), గాలిలోని ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరపడం వల్ల ఏర్పడిన మంటలే అవి. ఈ ప్రక్రియనే 'స్ఫురద్దీప్తి' (Phosphorescence) అంటారు. అలాగే ప్రార్థనా మందిరాల్లో నేలపై పడిన కొబ్బరి నీళ్లలో, పూజాసామగ్రిలో ఉండే భాస్వరం, ఇంకా కోళ్లఫారాలు, పశువుల పాకల్లోని అవశేషాల్లో ఉండే భాస్వరం కూడా పగలంతా సూర్యరశ్మికి ఆవిరై రాత్రి వేళల్లో గాలిలోని ఆక్సిజన్‌తో సంయోగం చెంది కాంతి పుంజాలుగా మారవచ్చు. ఇలా వెలుతురుతో కూడిన మేఘాలను దైవమహిమగా భావించక్కర్లేదు. బిగ్‌బ్యాంగ్‌ వంటి అద్భుతం ద్వారా ఏర్పడిన విశ్వాన్ని ఇప్పటికీ సమగ్రరూపంలో ఉంచుతున్న అలౌకిక శక్తికి ఇలాంటి లీలలు చూపించాల్సిన అగత్యం ఏమాత్రం లేదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


=======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...