Thursday, February 25, 2010

మొసలి కన్నీరు నిజమేనా?, Crocadile Tears True?





ప్రశ్న: జంతువులు కన్నీరు కారుస్తాయా? 'మొసలి కన్నీరు' అనే పదం ఎలా వచ్చింది?

జవాబు: మన కంట్లో ఏదైనా నలుసులాంటిది పడినప్పుడు, ఉద్వేగానికి గురైనప్పుడు కనుకొలుకుల్లో ఉండే భాష్ప నాళాల్లో (tear ducts) ఉండే ద్రవం కంటిలోకి ఊరి బయటకి జారుతుంది. అదే కన్నీరు. చాలా వరకూ జంతువులు కూడా ఇలాగే కన్నీరు కారుస్తాయి. కానీ మొసలికి మనలాగా కంటిలోపల భాష్పనాళాలు ఉండవు. జలచరమైన అది ఆహారాన్వేషణలో నేలపైకి వచ్చినప్పుడు దాని దేహం కళ్లతో సహా పొడిబారిపోతుంది. అది ఏదైనా జంతువును పట్టుకుని నమిలేప్పుడు దాని కింది దవడ మాత్రమే కదులుతుంది. పై దవడకు చలనం అంతగా ఉండదు. ఆ క్రమంలో మొసలి చాలా శ్రమ పడవలసి వస్తుంది. దాని ముఖంలోని కండరాలకు, గొంతుకు చాలా వత్తిడి కలుగుతుంది. అప్పుడు గొంతులో ఉండే ప్రత్యేకమైన గ్రంథుల నుండి ప్రొటీన్లతో కూడిన ద్రవం మొసలి కంటిలోనుంచి బయటకు ప్రవహిస్తుంది. అది చూస్తే ఆ మొసలి ఆ జంతువును తింటున్నందుకు జాలితో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. అది నిజం కాదు కాబట్టే కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ జాలి నటించే వారిని 'మొసలి కన్నీరు' కారుస్తున్నారనడం వాడుకగా మారింది.
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

అతిధ్వనులంటే ఏంటి?,ultrasonic sounds ?





ప్రశ్న: అతి ధ్వనులు అంటే ఏమిటి? వీటివల్ల ఉపయోగాలున్నాయా?

జవాబు: శబ్దాలను హెర్జ్‌ (Hertz)లో కొలుస్తారని తెలుసుకదా? ఇలా 20 నుంచి 20,000 హెర్జ్‌ల స్థాయిలో ఉండే శబ్దాలనే మన చెవి వినగలుగుతుంది. 20,000 హెర్జ్‌లకు ఎక్కువైన శబ్దాలను 'అతి ధ్వనులు' (ultrasonic sounds) అంటారు. ఏదైనా వస్తువు సెకనుకు 20,000 కంటే ఎక్కువ కంపనాలకు గురైనప్పుడే అతి ధ్వనులు ఏర్పడుతాయి.

వీటిని క్వార్ట్జ్‌ (quartz) లేక పింగాణీ (ceramic) లాంటి పదార్థాల గుండా ఏకాంతర విద్యుత్‌ (AC)ని ప్రవహింప చేయడం ద్వారా గానీ, యాంత్రిక, అయస్కాంత విధానాల ద్వారాగానీ పుట్టిస్తారు. 1890లో పియర్‌ క్యూరీ అనే శాస్త్రజ్ఞుడు ఆవిష్కరించిన అతి ధ్వనులను, రెండో ప్రపంచయుద్ధంలో జలాంతర్గాముల ఉనికిని కనిపెట్టడానికి ఉపయోగించారు.

దేహంలో ట్యూమర్లు, కిడ్నీ, లివర్‌ లాంటి భాగాల్లోని లోపాలను కనిపెట్టడంలో, గర్భస్థ శిశువు పెరుగుదలను కనుగొనడంలో, టంగ్‌స్టన్‌ లాంటి దృఢమైన లోహాలను కోయడంలో, వివిధ పరికారాల లోపలి భాగాల్లో కంటికి కనబడని పగుళ్లను కనుగొనడంలో, యంత్రభాగాలను, సర్జరీ పరికరాలను పరిశుభ్రం చేయడంలో రకరకాలుగా అతిధ్వనులు ఉపయోగపడతాయి.
  • ==================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నీళ్లతో మత్తు దిగేనా?, Alcohol effect clear with water?





ప్రశ్న: తాగిన వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందని అంటారు. నిజమేనా?

జవాబు: తాగుబోతులు తాగే ద్రావణంలో నీరు అధికంగానూ, ఇథైల్‌ ఆల్కహాలు కొద్దిగానూ ఉంటాయి. ఆల్కహాలు మోతాదునుబట్టి ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడుతుంది. ఇథైల్‌ ఆల్కహాలుకు తనంత తానుగా మత్తును కలిగించే గుణం లేదు. తాగినప్పుడు ఏ జీర్ణ ప్రక్రియ అవసరం లేకుండానే కొద్దిసేపటికే రక్తంలో కలిసే గుణం దీనికి ఉంది.

రక్తంలో కలిసిన వెంటనే అది దేహంలోని కణ జాలాల్లోకి బాగా త్వరితంగా చేరుకోగలుగుతుంది. కణాల్లోకి వెళ్లక అది సాధారణంగా అసిటాల్డిహైడుగా మారుతుంది. సారాయి తాగిన వాళ్ల దగ్గర్నుంచి వెలువడే దుర్గంధం దీనిదే. ఇది మెదడు కణాల్లోని అమైనో ఆమ్లాలలో చర్య జరిపి మత్తును, కైపును కలిగిస్తుంది.

తీసుకున్న మోతాదును బట్టి ఆ తాగుబోతు ప్రవర్తన, శరీర క్షేమం ఆధారపడ్తాయి. సారాయి, అసిటాల్డిహైడ్‌ నీటిలో బాగా కరుగుతాయి. మత్తులో జోగుతున్న మనిషి మీద బకెట్టు నీళ్లు పోస్తే అవి బట్టలను తడపడం వల్ల చాలా సేపు చర్మం చెమ్మగా ఉంటుంది కాబట్టి కనీసం చర్మంలో ఉన్న కణాల్లోని ఆల్కహాలు సంబంధిత రసాయనాలు బయటపడతాయి. ఒక్కసారిగా శరీర ఉపరితల ఉష్ణోగ్రత మారడం వల్ల కూడా ఆల్కహాలు ప్రభావం తగ్గుతుంది.
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

తారలకా పేర్లేంటి? , Stars are named so why?





ప్రశ్న: నక్షత్రాలను ఒకోసారి వైట్‌డ్వార్ఫ్‌, రెడ్‌ జెయింట్‌ అనే పేర్లతో ప్రస్తావిస్తారు. అవేంటి?

జవాబు: మనుషులకు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లాంటి దశలు ఉన్నట్టే నక్షత్రాలకు కూడా కొన్ని దశలుంటాయి. వాటినే వైట్‌ డ్వార్ఫ్‌, రెడ్‌ జెయింట్‌, సూపర్‌నోవా, బ్లాక్‌హోల్‌ పేర్లతో సూచిస్తూ ఉంటారు.
దాదాపు 15 బిలియన్‌ సంవత్సరాల కిత్రం సంభవించిన 'బిగ్‌బ్యాంగ్‌' అనే విస్ఫోటం మూలంగా ఈ విశ్వం ఏర్పడిందని చదువుకుని ఉంటారు కదా. అప్పుడు రోదసి అంతా దట్టమైన వాయువులు, ధూళితో కూడిన మేఘాలు వ్యాపించాయి. ఈ మేఘాల్లో 90 శాతం హైడ్రోజన్‌, కొద్దిపాటి ఇతర వాయువులు, సూక్ష్మ హిమకణాలు, కాస్మిక్‌ ధూళి ఉండేవి. ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తి వల్ల కుంచించుకుపోతూ ఉంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇలా వాయు, ధూళి మేఘాల మధ్య భాగంలో ఉష్ణోగ్రత పదిమిలియన్‌ డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. సరిగ్గా ఈ స్థితిలోనే అక్కడి హైడ్రోజన్‌ అణువులు సంయోగం చెంది హీలియం ఏర్పడుతుంది. ఫలితంగా అత్యధిక శక్తి కాంతి రూపంలో వెలువడుతుంది. అదే నక్షత్రం.
రెడ్‌జెయింట్‌ (అరుణ బృహత్తార): నక్షత్రంలో హైడ్రోజన్‌ ఇంధనం లభించినంత వరకూ తాపకేంద్రక చర్యలు (thermo nuclear reactions) జరుగుతూనే ఉంటాయి. హైడ్రోజన్‌ ఖాళీ అయిపోగానే గురుత్వ ప్రభావం వల్ల నక్షత్ర కేంద్రకం కుచించుకు పోవడం మొదలవుతుంది. దాంతో కేంద్రకం అంచుల వద్ద ఉండే కర్పరం (shell)పై వత్తిడి పెరిగి ఉష్ణం ఉద్భవిస్తుంది. అప్పుడు కర్పరంలో మిగిలిన హైడ్రోజన్‌ పరమాణువుల మధ్య కేంద్రక సంలీనం (nuclear fusion) జరుగుతుంది. దాని ఫలితంగా నక్షత్ర పొరలు వ్యాకోచం చెంది దాని వ్యాసం అనేకరెట్లు ఎక్కువవుతుంది. ఈ దశలో అరుణకాంతిని వెదజల్లే నక్షత్రాన్నే 'రెడ్‌ జెయింట్‌' అంటారు.

వైట్‌డ్వార్ఫ్‌ (శ్వేత వామన తార): అనేక మిలియన్‌ సంవత్సరాల తర్వాత నక్షత్రంలో లభించే హైడ్రోజన్‌ పూర్తిగా ఖర్చయిపోతుంది. అప్పుడు రెడ్‌జెయింట్‌ తన లోని పదార్థకణాలను వెదజల్లుతూ పేలిపోతుంది. నక్షత్రం కాంతిని కోల్పోయి మసకబారుతుంది. నక్షత్రంలో మిగిలిన ద్రవ్యకణాలు ఎక్కువ ఒత్తిడికి లోనవడంతో అది అంతకు ముందున్న ఘనపరిమాణంలో 1/10 వంతుకు తగ్గి మరుగుజ్జులా మారి తెల్లని కాంతిని వెదజల్లుతుంది. ఇదే వైట్‌డ్వార్ఫ్‌.

====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

స్పాంజి రహస్యమేంటి?,Sponge Secret-what?





ప్రశ్న: మనం ఇంట్లో వాడే స్పాంజిని దేనితో, ఎలా తయారు చేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకోగలుగుతుంది?

జవాబు: మామూలు నార, దూది, పాత గుడ్డ వంటి వాటిని లుంగచుట్టినా అవి కూడా స్పాంజిలాగే పనిచేస్తాయి. మనం వాడే తువ్వాలు, జేబురుమాలు, వంటింటి మసిగుడ్డ కూడా స్పాంజి పనిచేసే సూత్రం ఆధారంగానే పయోగపడుతున్నాయి. స్పాంజి ఒక ప్లాస్టిక్‌ పాలిమర్‌. అంటే ముద్దగా ఉన్న పాలిమర్‌ పదార్థంలో అత్యధికంగా గాలి గదులు ఉంటాయి. ఒక గదికి, మరొక గదికి కూడా మార్గాలు ఉంటాయి.అందువల్ల చూడ్డానికి పెద్దగానే ఉన్నా అందులో ఉండేది ఎక్కువ ఖాళీనే. దీని తయారీ దశలోనే ద్రవస్థితిలో ఉండే పాలిమర్‌లోకి నైట్రోజన్‌ను కానీ, గాలిని కానీ, కార్బన్‌డయాక్సైడును కానీ నురగ రూపంలోపంపుతారు. అందువల్లనే రంధ్రాలతో స్పాంజి ఏర్పడుతుంది. ఇక అది నీటిని పీల్చుకోవడానికి కారణం ద్రవాలకుండే తలతన్యత అనే ధర్మమే. సన్నపాటి సందుల్లోకి ద్రవాలు పాకడాన్నే కేశనాళికీయత (capillarity) అంటారు. ఈ లక్షణం వల్లనే అద్దుడు కాగితం ఇంకుని, సుద్దముక్క నీటిని, తువ్వాలు తడిని, స్పాంజి నీటిని పీల్చుకుంటాయి. దీపంలో వత్తి ద్వారా నూనె పైకి పాకడానికి, చెట్ల వేర్ల ద్వారా నీరు ఆకుల్లోకంటా చేరడానికి కూడా ఇదే కారణం.

  • ================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, February 20, 2010

వంతెన పై వెళ్ళేటపుడు రైలు ఎందుకు ఎక్కువ శబ్దము చేస్తుంది ?,Train makes more sound on a bridge-why?




ప్ర : రైలు వంతెన మీద వెళుతున్నప్పుడు శబ్దము అధికంగా వినపడడానికి కారణము ఏమిటి?.

జ : రైలు పట్టలకు చక్రాలకు మధ్య ఏర్పడే ఘర్షణ , రైలుపట్టాలను పట్టి ఉంచే స్లీపర్స్ కింది భాగం గాలితో నిండి ఉండటమే కారణము . దీనివల్ల శబ్ద కంపనాల పరిమాణం పెరిగి శబ్దతీవ్రత అధికం గా వినిపిస్తుంది.
పైగా వంతెన కింద ఉన్న నీరు , నేల ఆ ధ్వనిని ప్రతిద్వనింప చేస్తాయి . కాబట్టి శబ్దాల స్థాయి మరింత తీవ్రం గా ఉంటుంది . రైలు వెళుతుంటే బ్రిడ్జి మీద కంపించే వస్తువుల స్వభావ మార్పుల వలన ఈ ధ్వని తీవ్రత , ధ్వని విధానము మారుతూ ఉంటుంది . అందుకే అంత శబ్దము వస్తుంది .


  • =========================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, February 18, 2010

భూమి తిరుగుడు ఆగునా? , Earth Roatation Stops?




ప్రశ్న: భూమి బొంగరం మాదిరిగా తన చుట్టూ తాను తిరుగుతుంది కదా? బొంగరం కాసేపటికి ఆగిపోయి పక్కకు పడిపోయినట్టే భూమి కూడా పడిపోతుందా?

జవాబు: మొదట భూమి ఎందుకు తిరుగుతోందో తెలుసుకుందాం. పాలపుంతలో నక్షత్రాలు, సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, మన భూమి.. ఇవన్నీ కూడా తన చుట్టూ తాను పరిభ్రమిస్తున్న వాయు-ధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. పరిభ్రమిస్తున్న వాయువుల నుంచి ఏర్పడిన ఏ వస్తువైనా ఆ వాయువుల ధర్మాన్ని కలిగి ఉండాలన్నది ఒక భౌతిక శాస్త్ర నియమం. దీనిని కోణీయ ద్రవ్య వేగ సూత్రం (law of conservation of Angular mimentum) అంటారు. ఈ నియమం ప్రకారమే పాలపుంత, సౌరకుటుంబం కూడా తన చుట్టూ తాను పరిభ్రమించే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే భూమి కూడా రోదసిలో నిరంతరంగా బొంగరంలాగా తిరుగుతూనే ఉంది. ఇప్పుడు బొంగరం ఎందుకు ఆగిపోతుందో చూద్దాం. బొంగరం తిరిగేప్పుడు దాని చుట్టుపక్కల ఉండే గాలి వల్ల, అది ఆని ఉన్న ఉపరితలం వల్ల కలిగే ఘర్షణలాంటి బలాలు దానిపై పనిచేసి కాసేపటికి వేగం క్షీణించి పక్కకు పడిపోతుంది. అయితే భూమిపై పనిచేయడానికి అలాంటి బలాలేమీ అంతరిక్షంలో లేవు. అంతరిక్షంలో ఉండే ఘర్షణశక్తులు చాలా స్వల్పం (శూన్యానికి దగ్గర) కాబట్టి భూమి తన చుట్టూ తాను సెకనుకు 460 మీటర్ల వేగంతో (అంటే నిమిషానికి 27,600 మీటర్లు) తిరుగుతూనే ఉంటుంది. అది అలా తిరుగుతూ తిరుగుతూ అనేక వేల మిలియన్ల సంవత్సరాల తర్వాత, బహుశా పరిభ్రమణ వేగం తగ్గి, బహుశా గురత్వాకర్షణ ఎక్కువవడం వల్ల ఉత్పన్నమయ్యే బిగ్‌క్రంచ్‌ అనే ప్రభావం వల్ల ఆగిపోతుందేమో!



  • ===============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, February 17, 2010

కరగడంలో తేడాలేల? ,ice melting differences ?






ప్రశ్న:
అరచేతిలో ఐసుగడ్డ తొందరగా కరగదు. అదే నీటిలో వేస్తే తొందరగా కరుగుతుంది. ఎందుకు?

జవాబు:
ఐసుగడ్డ ద్రవీభవించాలంటే దానికి తగిన ఉష్ణం చేరాలి. దాన్ని అరచేతిలో ఉంచుకున్నప్పుడు చాలా భాగానికి గాలితో స్పర్శ ఉంటుంది. కానీ గాలిలో ఉష్ణ ప్రవాహత (thermal conductivity) తక్కువ. కొంత మేరకు అరచేతితో స్పర్శ ఉన్నా అది లెక్కలోకి రాదు. అదే ఐసుగడ్డను నీటిలో వేసినప్పుడు అది కొంత మేరకు తేలినా, అధిక భాగం నీటికి తాకి ఉంటుంది. గాలి కన్నా నీటి ఉష్ణవాహకత్వం ఎక్కువ. కాబట్టి సరిపడినంత ఉష్ణం తొందరగా ఐసుగడ్డను చేరడం వల్ల అది తొందరగా కరిగిపోతుంది.

  • ================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, February 06, 2010

పాముని పాము కాటేస్తే? ,Snake bites Snake - snake dies?





ప్రశ్న: విషపూరితమైన పాము కాటేస్తే వేరే పాము చనిపోతుందా?

జవాబు: విషపూరితమైన పాము కోరలకు అనుసంధానంగా విషగ్రంథులు ఉంటాయి. పాము కాటేసినప్పుడు ఆ గ్రంథులలో ద్రవరూపంలో ఉండే విషం, కోరల గుండా ప్రవహించి బయటకి వస్తుంది. కోరలు చేసిన గాయం ద్వారా కాటుకు గురైన జీవి దేహంలోకి ప్రవేశిస్తుంది. ఆ విషం ఆ జీవి రక్తంలో కలిస్తే అది చనిపోయే అవకాశం ఉంటుంది. అది మరో పామైనా సరే. చనిపోవడం అనేది విషం మోతాదుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాధుల నివారణకు పాము విషాన్ని మందుగా వాడతారు. అప్పుడు ఆ విషం వ్యక్తి రక్తంలో కలవకుండా జీర్ణవ్యవస్థలో జీర్ణమవడంతో హాని జరగదు. కాటు వేసిన పాముకి కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. పొటాషియం సైనైడ్‌ లాంటి విషపదార్థాలను సేవించి చనిపోయిన వ్యక్తి దేహాన్ని పాము కాటు వేస్తే దాని కోరల గుండా ఆ విషం దాని రక్తంలోకి ప్రవేశించి పాము చనిపోయే అవకాశం ఉంది. అలాగే డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలను చాలా కాలంగా వాడే వ్యక్తి రక్తం కూడా విషపూరితమవుతుంది. అతడిని కాటేసినా పాముకే ప్రమాదం.



  • ============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, February 02, 2010

విశ్వంలో పరిమాణాలెన్ని?, Mass are how many?





ప్రశ్న: విశ్వంలో ప్రస్తుతం ఉన్న పరిమాణాలు కాక వేరేవి ఉన్నాయా?

జవాబు: న్యూటన్‌ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని ప్రదేశానికి (space) పొడవు, వెడల్పు, ఎత్తు అనే మూడు పరిమాణాలుంటాయి. ఈ పరిమాణాలకు, కాల (time) పరిమాణానికి సంబంధం లేదు. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం ద్వారా విశ్వంలోని మూడు పరిమాణాలకు కాల పరిమాణాన్ని కూడా జతపరిచాడు. అంటే ఆయన సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని పరిమాణాలు నాలుగు. ఇక విశ్వంలో నాలుగు శక్తులుంటాయి. అవే గురుత్వ, విద్యుదయస్కాంత, దుర్బల, ప్రబల కేంద్రక శక్తులు. వీటిలో గురుత్వ శక్తి తప్ప మిగతా మూడూ కణ సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి. అంటే ఇవి విడివిడిగా ఉండే ప్యాకెట్ల (quantum)లాగా విశ్వంలో ఉంటే, గురుత్వ శక్తి మాత్రం ఖాళీ లేకుండా, అవిచ్ఛిన్నంగా (continuous)గా వ్యాపించి ఉంటుంది. ఈ నాలుగు శక్తులనూ ఒకే తాటి పైకి తేవడానికి 'స్ట్రింగ్‌ థియరీ'ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం 11 పరిమాణాలు ఉంటాయి. అయితే విశ్వంలోని నాలుగు పరిమాణాలకు అదనంగా ఉండే 7 పరిమాణాలు మన కంటికి కనబడని అత్యంత సూక్ష్మ ప్రదేశాలకే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకు సాలెగూడులోని పోగులు మన కంటికి ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. అదే మైక్రోస్కోపులో చూస్తే అవే పొడవు, వెడల్పు, లోతు అనే మూడు పరిమాణాల్లో కనిపిస్తాయి. అలాగే స్ట్రింగ్‌ సిద్ధాంతంలోని తంత్రులలో ఉండే పదకొండు పరిమాణాలు ఉన్నాయనడానికి ఖగోళ, కణ శాస్త్రవేత్తలు వాడే సున్నితమైన పరికరాల ద్వారా సాక్ష్యం లభిస్తుంది.

  • =====================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.