Tuesday, March 30, 2010

గుచ్చుకున్న వాటితో సెప్టిక్‌ అవుతుందేం?, Septic of wound Cause ?




ప్రశ్న: ఇనుప వస్తువులు గుచ్చుకుంటే సెప్టిక్‌ ఎందుకు అవుతుంది?

జవాబు: పాత ఇనుప వస్తువులే కాదు, చాలా కాలం నేలమీద, మురికి ప్రదేశాల్లో ఉన్న ముళ్లు గుచ్చుకున్నా, పాత కర్రముక్కలు గుచ్చుకున్నా కూడా సెప్టిక్‌ అవుతుంది. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, చెక్క ముక్క సందుల్లో, ముళ్ల పొదల మూలల్లో నీటి ఆవిరి, దుమ్ము పేరుకుంటాయి. వీటి మీద సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరుచుకుని వేలాదిగా పెరిగిపోయి ఉంటాయి. ఆయా వస్తువులు మన శరీరానికి గుచ్చుకున్నప్పుడు ఆ గాయం ద్వారా సూక్ష్మజీవులు మన రక్తంలో కలుస్తాయి. రక్తంలో పోషక విలువలు కలిగిన జీవకణాలు ఆహారంగా లభించడంతో సూక్ష్మజీవుల వృద్ధి మరింతగా పెరుగుతుంది. అందువల్ల పుండు (septic) అవుతుంది. నిజానికి చెత్త కుండీల్లో ఉన్న కాగితాలు, మురికి రోడ్డు మీది మట్టికణాలు రక్తాన్ని చేరుకున్నా ఇలాగే సెప్టిక్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే అవి గుచ్చుకోవు కాబట్టి ప్రమాదం ఉండదు. పాత పడిన మురికి పరికరాలు ఏవి గుచ్చుకున్నా వైద్యుని సంప్రదించి టెట్నస్‌ టీకా తీసుకోవడం మంచిది.టెటనస్ క్రిములవలన ధనుర్వాతము అనే జబ్బు వచ్చే ప్రమాదము ఉంటుంది .

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పశువులు నెమరు వేస్తాయేం?, Rumination of cattles?




ప్రశ్న: ఒకసారి తినేసిన ఆహారాన్ని పశువులు తిరిగి నోట్లోకి తెచ్చుకుని నములుతాయెందుకు?

జవాబు: ఆవులు, ఎద్దులు, గేదెల్లాంటి పశువులను నెమరు వేయు జంతువులని పిలుస్తారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే విధానంలో భాగంగానే ఇవి నెమరు వేస్తాయి. వాటి పొట్టలోని జీర్ణాశయంలో నాలుగు గదుల్లాంటి భాగాలుంటాయి. అవి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి సుమారు మూడు రోజులు పడుతుంది. పశువులు తమకు లభించిన గడ్డి, మొక్కల్లాంటి మేతను నమిలి మింగకుండా మొదట నేరుగా మింగేస్తాయి. అలా మింగిన ఆహారం దాని జీర్ణాశయంలోని మొదటి గది ర్యూమన్‌ (rumen)లోకి చేరుకుని అక్కడ మెత్తబడి కొంత వరకూ జీర్ణమవుతుంది. అక్కడ ఇంకా జీర్ణం కాని గరకు, పీచులాంటి ఆహారపదార్థాలను పశువులు తిరిగి నోట్లోకి తెచ్చుకుని దంతాలతో నిదానంగా మెత్తగా అయ్యేవరకూ నములుతాయి. దీన్నే నెమరు వేయడమంటారు. ఇలా మెత్తబడిన ఆహారం ఆవు జీర్ణాశయంలోని రెండో గది రెటిక్యులమ్‌ (reticulum)లోకి చేరుకుంటుంది. అక్కడ వడబోతకు గురైన ఆహారం మూడో గది ఒమేసమ్‌ (omasum)లోకి చేరుతుంది. అక్కడ ఇంకా బాగా జీర్ణమై అబోమేసమ్‌ (abomesum)లోకి వెళ్తుంది. అక్కడ పూర్తిగా జీర్ణమవుతుంది.
  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
http://dr.seshagirirao.tripod.com/

చెవిలో గులిబి ఎందుకు వస్తుంది?, Ear wax story






ప్రశ్న: చెవిలో గులిబి ఎందుకు వస్తుంది? దాని వల్ల ఉపయోగం ఏమిటి?

జవాబు: పంచేంద్రియాల (sensory organs) లో చెవి కూడా ఒకటి. ఇవి పరిసరాలకు తెరిచి ఉంటాయి. దాదాపు ఒక అంగుళం మేర లోతుగా గొట్టంలాగా ఉన్న బయటి చెవి భాగం చివర కర్ణభేరి (ear drum) ఉంటుంది. గాలిలో ప్రయాణించే శబ్ద కంపనాలకు అనుగుణంగా సున్నితమైన కర్ణభేరి కంపనం చెందుతుంది. ఆ కంపనాలకు అనుసంధానంగా ఆవలి వైపుగా అంటుకుని ఉన్న ఎముకలు, ఆపై కాక్లియా అనే మరింత సున్నితమైన భాగం కూడా శబ్ద సంకేతాల్ని గ్రహిస్తాయి. గాలిలో ఉండే దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు చెవిలో ప్రవేశిస్తే సున్నితంగా ఉండే కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ప్రకృతి సిద్ధంగా చెవి గొట్టంలో సెబేషియస్‌ గ్రంథులు ఉంటాయి. ఇవి నూనె లాంటి జిగురుగా ఉండే స్రావాలను విడుదల చేస్తాయి. అందువల్ల దుమ్ము, ధూళి కణాలు ఆ జిగురుకు అంటుకుపోతాయి. అలా క్రమేపీ పోగయినవన్నీ కలిసి గులిబి (wax) అనే మెత్తని అర్ధఘన (semisolid) పదార్థం ఏర్పడుతుంది. దీన్ని వైద్యుడు మాత్రమే తొలగించగలడు. సొంతంగా పిన్నుల లాంటి పరికరాలు వాడడం ప్రమాదకరం.

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

చదరంగం సంగతేమిటి ? , Chess game -About?





చదరంగం ఆటే..ఒకరకము ఆట .. మరి ఇది ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది?

కొన్ని శతాబ్దాల క్రితం.. మన దేశంలో బలహైతు అనే ఓ రాజు ఉండేవాడు. అతడోసారి తన ఆస్థానంలో తెలివైనవాడిగా పేరున్న సిస్సా అనే వ్యక్తిని పిలిపించాడు.

'ఈనాటి ఆటలన్నీ బలం మీదనో, అదృష్టం మీదనో ఆధారపడి ఉన్నాయి. అలాకాకుండా తెలివితో ఆడే, తెలివిని పెంచే ఆటని రూపొందించగలరా?' అని అడిగాడు. సరేనన్న సిస్సా 64 గడులపై భట, సైనిక, హయ, గజ బలాలతో సాగే ఆటను రూపొందించి, 'చతురంగ' అని పేరు పెట్టాడు.

ఆ ఆటను చూసి మురిసిపోయిన రాజు 'ఇందుకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోండి' అన్నాడు. దానికి సిస్సా ఏం అడిగాడో తెలుసా? ఆ ఆటని ఆడే పట్టికలో మొదట గడిలో ఒక ధాన్యం గింజని ఉంచి, తరువాత ప్రతి గడికీ వాటి సంఖ్యను రెట్టింపు చేస్తూ 64 గడులకీ ఎన్నవుతాయో అంత ధాన్యాన్ని ఇమ్మని కోరాడు. మొదట ఆ కోరిక చాలా చిన్నదని భావించిన రాజు ఆ తర్వాత దాన్ని తీర్చడం అసాధ్యమని గ్రహించాడు. ఎందుకో తెలుసా? అలా లెక్కించే ధాన్యం గింజల సంఖ్య 18,445,744,073,709,551,515 అని తేలుతుంది. ఇది ప్రపంచం మొత్తం మీద పండే ధాన్యం గింజల కన్నా ఎన్నో రెట్లు అధికం. అప్పుడు రాజు సిస్సాను ఘనంగా సత్కరించి ఆ ఆటను దేశదేశాల్లో ప్రచారం చేస్తాడు. చెస్‌ పుట్టుక వెనుక ప్రచారంలో ఉన్న కథ ఇది!

* కథ పక్కన పెడితే చదరంగం పుట్టింది మన దేశంలోననే ఎక్కువ శాతం చరిత్రకారులు నమ్ముతారు. క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో దీన్ని ఆడినట్టు ఆధారాలున్నాయి. కొంతమంది మాత్రం చైనాలో పుట్టిందని చెబుతారు. అక్కడ రెండో శతాబ్దంలోనే చెస్‌ని పోలి ఉన్న క్సియాంగి అనే ఆటను ఆడేవారంటారు.

* ఇప్పుడు మనం ఆడుతున్న ఆటకు 15వశతాబ్దంలో పూర్తి రూపం వచ్చింది. ఇది ఒక క్రీడగా గుర్తింపు పొందింది 19వ శతాబ్దంలో. ప్రపంచంలో తొలిసారిగా 1851లో చదరంగం పోటీలను లండన్‌లో నిర్వహించారు. అధికారికంగా ప్రపంచస్థాయి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు జరిగింది మాత్రం 1886లో.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, March 26, 2010

యక్షప్రశ్నలు అంటే ఏమిటి ?, Yakshaprashnalu story





యక్ష ప్రశ్నలు ....మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు . వాటికి ధర్మజుని సమాధానాలలో మన జీవన విధానానికి మార్గ దర్శకాలుగా ఉన్న కొన్నింటిని ఇక్కడ సేకరించి వ్రాయడము జరిగినది . ఒక్కొక్క గ్రందము లొ ఒక్కోవిధం గా ఉన్నా అన్ని ప్రశ్నల సమాధానాల సారాంసము ఒక్కటే . మొత్తము 72 ప్రశ్నలు అడినట్లు పురాణాలలో ఉన్నది .

పూర్తీ వివరాలకోసం -

  • ================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, March 14, 2010

క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా? , Christamus Tree Story ?





రకరకాల బహుమతులు.. బొమ్మలు.. కేకులతో.. క్రిస్‌మస్‌ పండుగ చేసుకుంటున్నారు కదా! మరి క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా? శాంతాక్లాజ్‌ తాతయ్య ఎవరో తెలుసా? ఆ కథలేంటో తెలుసుకుందామా!

వరాలిచ్చే చెట్టు! --క్రిస్మస్‌ నాడు చెట్లను అందంగా అలంకరిస్తారు కదా, మరి ఆ అలవాటు ఎలా మొదలైందో తెలుసా? దాని వెనుక కొన్ని కథలు కూడా ఉన్నాయి.
చాలా ఏళ్ల క్రితం క్రీస్తు పుట్టిన రోజున చర్చికి వెళ్లి రకరకాల బహుమతులను క్రీస్తుకు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లాడికి పాపం... ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో సెంటు కూడా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబోకి తన ఇంటి ముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన అందరూ ప్లాబో కానుక చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూ దానిని బాల ఏసు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యం...! వెంటనే ఆ చిన్న మొక్క అప్పటికప్పుడే ఎదిగిపోయి బంగారు వృక్షంగా మారిపోయింది. పవిత్ర హృదయంతో తీసుకొచ్చిన ఆ కానుకనే జీసెస్‌ స్వీకరించాడని అందరూ నమ్మారు. అప్పటి నుంచి క్రిస్మస్‌ చెట్టుని అలంకరిస్తున్నారు.

ఇలాంటిదే మరో కథ కూడా ఉంది.
చలిగాలులు వీస్తున్నాయి. మంచు కురుస్తోంది. చిన్న పాకలో అన్న వాలంటైన్‌, చెల్లి మేరీ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. ఏదైనా తిని రెండు రోజులైంది. నీర్సంగా ఉన్నారు. ఇంతలో నాన్న వచ్చాడు. చేతిలో రొట్టెముక్క! దాన్నే మూడు భాగాలు చేసుకుని ప్రార్థన చేయసాగారు. 'ఓ జీసస్‌ మాలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వాళ్లందరీ కడుపు నింపు'. ప్రార్థన తర్వాత తినబోతుండగా తలుపు చప్పుడైంది. తీసి చూస్తే ఆరేళ్ల పిల్లాడొకడు చలికి వణికిపోతూ 'ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా?' అని అడిగాడు. లోపలికి రమ్మన్నారు. 'తిని నాలుగు రోజులైంది' అన్నాడా పిల్లాడు దీనంగా. తమ రొట్టె ఇచ్చి, రగ్గు కప్పి పడుకోబెట్టారు. అతడి ఆకలిని తీర్చగలిగామన్న తృప్తితో వాళ్లు నిద్రపోయారు. అర్థరాత్రి అన్నాచెల్లెల్లిద్దరికీ మెలకువ వచ్చింది. పైన మిలమిలలాడే నక్షత్రాలు. ఎగురుతున్న దేవదూతలు. వాళ్లింటికి వచ్చిన పిల్లాడు ఎవరో కాదు. బాల ఏసు! తల మీద బంగారు కిరీటంతో విలువైన బట్టలతో మెరిసిపోతున్న అతడు, 'మీ దయ గొప్పది. పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు' అని దీవించాడు. వాళ్లింటి బయట ఎండిన కొమ్మని నాటాడు. అది చూస్తుండగానే చిగురించి పెరిగి పెద్దదైంది. దాన్నిండా బంగారు యాపిల్‌ కాయలు! అదే మొట్టమొదటి క్రిస్‌మస్‌ చెట్టు.

బహుమతుల తాతయ్య!
ఎర్రటి గౌను, టోపీ, తెల్లగడ్డంతో బహుమతులిచ్చే శాంతాక్లాజ్‌ తాతయ్య అసలు పేరు తెలుసా? నికోలస్‌. క్రీస్తుశకం 270 కాలంలో ఇప్పటి టర్కీ ప్రాంతంలోని ఓ చర్చిలో బిషప్‌. గుర్రం మీద తిరుగుతూ పేదవారికి సాయం చేస్తుండేవాడు. ఓ రోజు ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయలేక బాధపడతున్న పేదవాడు కనిపించాడు. అతడికి సాయం చేయడానికి బంగారు నాణాలు నింపిన మూడు మూటల్ని వాళ్లింటి పొగగొట్టంలోంచి పడేశాడు. ఆ డబ్బుతో పేదవాడు ఎంతో సంబరంగా కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. అలా ఎంతమందికో తనెవరో తెలియకుండా బహుమతులు ఇచ్చే అతడికే సెయింట్‌ హోదా లభించింది. అతడే శాంతాక్లాజ్‌!



* ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్‌ చెట్టు ఎక్కడుందో తెలుసా? అబుదాబిలో ఓ హోటల్లో. 40 అడుగుల ఎత్తున నిర్మించిన దీని విలువ కోటి పది లక్షల డాలర్లు. ఈ చెట్టుని 181 వజ్రాలు, ముత్యాలు, విలువైన రాళ్లతో అలంకరించారు.
* క్రిస్మస్‌ చెట్టును మొదటిసారిగా అలంకరించింది 1510లో. ఇళ్లల్లోకి తీసుకువచ్చి చెట్టును పెట్టే సంప్రదాయం వచ్చింది 16వ శతాబ్దంలో.
* అమెరికాలో ఏటా మూడు కోట్ల క్రిస్మస్‌ చెట్లు అమ్ముడవుతాయి. పది లక్షల ఎకరాల్లో వీటిని పెంచుతారు.
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, March 13, 2010

ప్రపంచంలోనే అతి చిన్న నక్క , Fox-smallest in the world




గబ్బిలం చెవులు.. ఒళ్లంతా బొచ్చు.. అరచేతిలో ఇమిడే శరీరం.. ఇదేంటో తెలుసా? ప్రపంచంలోనే అతి చిన్న నక్క!

మామూలుగా నక్క అనగానే అడవిలో జింకల్ని సైతం వేటాడగలిగే జంతువు గుర్తొస్తుంది కదా? కానీ నక్కల జాతిలోనే అతి చిన్నదొకటుంది.మహా ఎదిగితే ఇది 16 అంగుళాల పొడవుంటుందంతే. బరువైతే కేవలం కిలోన్నరే. అంటే బలిసిన పిల్లి ముందు చూస్తే ఇదే చిన్నగా కనిపిస్తుందన్నమాట. అదే ఫెన్నెక్‌ ఫాక్స్‌. ఎడారి నక్కని కూడా అంటారు.

ఈ బుజ్జినక్క రూపం భలే ముచ్చటగా ఉంటుంది. ఒళ్లంతా బొచ్చు. అదాటుగా చూస్తే బుల్లి కుక్క పిల్లలా కనిపిస్తుంది. చేతులతో ఎత్తుకుంటే దోసిట్లో చక్కగా ఇమిడిపోతుంది కూడా. ఇక దీని చెవులు పెద్దగా, దొప్పల్లా ఆరు అంగుళాల పొడవుంటాయి. ఇవి ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతంలో కనిపిస్తాయి. ఇంత చిన్నది పాపం.. అక్కడి వేడికెలా తట్టుకుంటుందనే సందేహం అక్కర్లేదు. ఇది కేవలం రాత్రిళ్లే తిరుగుతుంది. అంటే నిశాచర (నాక్టర్నల్‌) జీవన్నమాట. మరి పగలు? నేలలో బొరియలు తవ్వుకుని లోపల పడుకుని నిద్రపోతుంది.

ఇవి గుంపులుగా తిరుగుతాయి. ఒక్కో గుంపులో కనీసం పది నక్కలైనా ఉంటాయి. ఇంతకీ ఇవి తినేదేంటో తెలుసా? ఎడారి మొక్కలు, గడ్డితో పాటు ఎలుకలు, కీటకాలు, బల్లులు, పక్షులు, గుడ్లు. దీనికో విచిత్ర గుణం ఉంది. నీళ్లు తాగకపోయినా చాలా రోజులు హాయిగా ఉండగలదు. తినే మొక్కల్లో ఉండే తేమ వీటికి చాలన్నమాట. పైగా వీటి మూత్రపిండాలు కూడా ప్రత్యేకంగా పని చేస్తూ, ఎక్కువ నీరు బయటికి పోకుండా కాపాడుతాయి.

అన్నట్టు.. దీని చర్మానికి బోలెడు గిరాకీ తెలుసా? అందుకే పాపం, అక్కడి ప్రజలు వీటిని కనిపిస్తే చాలు, వేటాడేస్తుంటారు. ఇవి లేకపోతే ఎడారి ఎలుకల సంతతి తీవ్రంగా పెరిగిపోతుంది. కనుక వీటిని కాపాడుకోవలసిన అవసరం ఉందని అక్కడి ప్రభుత్వాలు గుర్తించాయి. ఆడ నక్క ఏడాదికి అయిదు వరకు పిల్లల్ని కంటుంది. ఇవి కేవలం పది నెలలకే పెద్దవై పోతాయి. వీటికి వినికిడి శక్తి చాలా నిశితంగా ఉంటుంది. నేల కింద తచ్చాడుతున్న జీవుల రాకపోకలను ఇది గ్రహించగలదు.
మీకు తెలుసా?
* నక్కల్లో మొత్తం 25 జాతులు ఉన్నాయి.
* ఒక నక్క రోజుకి ఒక కిలో మాంసాన్ని ఆహారంగా తింటుంది.
* జపాన్‌లో నక్కలను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు.
* ఏదైనా జీవిని పట్టుకున్నాక కాసేపు వాటితో చెలగాటమాడి ఆ తర్వాతే తింటాయి.

  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఎలిఫేంట్‌ సీల్ కధ ఏమిటి?, Elephant Seal Story?




ఏనుగు తొండంలాంటి ముక్కు.. నాలుగువేల కిలోల బరువు.. 20 అడుగుల పొడవు.. ఈ జీవి పేరు.. ఎలిఫేంట్‌ సీల్‌ దీని గురించి కొత్త విషయం బయటపడింది..

సముద్ర జీవులెన్నో పిల్లల్ని పెట్టడానికో, లేదా కాలం మారినప్పుడో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళతాయని తెలుసుకదా! అలాగే ఎలిఫేంట్‌సీల్‌లు కూడా శీతాకాలం వచ్చేసరికి ప్రతి ఏడాది కాలిఫోర్నియా నుంచి అలస్కా తీరానికి పసిఫిక్‌ సముద్రం మీదుగా వలస వెళతాయి. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయో తెలుసా? 2000 నుంచి 3000 కిలోమీటర్లు. సుమారు రెండు నుంచి ఎనిమిది మాసాల వరకు సముద్రంలో ఈదుతూనే ఉంటాయి. మరి ఇవి అలసిపోవా? ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి? ఎప్పుడు నిద్రపోతాయి? ఈ సందేహాలన్నీ శాస్త్రవేత్తలకు వచ్చాయి. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడం కోసం పెద్ద పరిశోధనే చేశారు.

జపాన్‌లోని టోక్యోలోని శాస్త్రవేత్తలు ఆరు ఎలిఫేంట్‌ సీల్స్‌ని తీసుకుని వాటి వీపులకి ఎలక్ట్రానిక్‌ టాగ్‌లు కట్టారు. అవి ఉపగ్రహాలతో అనుసంధానమై ఉంటాయి. అందువల్ల సీల్స్‌ ఎంత వేగంతో, ఎంత లోతులో ఈదుతున్నాయి, ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? వాటి ప్రయాణ మార్గం ఎలా ఉంది, ఇలా అన్ని వివరాలూ ఎప్పటికప్పుడు నమోదై ఉపగ్రహాలకి ప్రసారం అవుతుంటాయి. అవి తిరిగి పరిశోధకులకు అందుతాయి. కంప్యూటర్లలో ఆ సమాచారాన్ని విశ్లేషించి వివరాలు సేకరిస్తారు. ఇలా పరిశోధించేసరికి కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు బయటపడ్డాయి.

ఎలిఫెంట్‌ సీల్స్‌కి అలసట వస్తే వెల్లకిలా తిరిగి అలా ఉండిపోతాయి. ఈదడం ఆపేయడం వల్ల అవి నెమ్మదిగా లోతుల్లోకి జారిపోవడం మొదలుపెడతాయి. ఎలాగో తెలుసా? గుండ్రంగా తిరుగుతూ. చెట్టు మీద నుంచి పడే ఆకు గిరగిరా తిరుగుతూ పడినట్టన్నమాట. అదే వాటి విశ్రాంతి. అలా కాసేపు కావాలని మునిగిపోయాక చటుక్కున లేచి ఓసారి ఒళ్లు విరుచుకుని జామ్మంటూ ఈదడం మొదలెడతాయి. సాధారణంగా డాల్ఫిన్లు, తిమింగలాలు లాంటి సముద్రపు క్షీరదాలు ఈదుతూనే నిద్రపోగలవు. వాటి మెదుడులో సగభాగం విశ్రాంతి తీసుకుంటే, రెండో భాగం పని చేస్తూఉంటుంది. వీటికి భిన్నంగా ఎలిఫెంట్‌ సీల్స్‌ ప్రవర్తిస్తాయన్నమాట. భలే ఉంది కదూ!

*ప్రపంచంలో ఉన్న సీల్‌ చేపలన్నింటిలో ఎలిఫేంట్‌ సీల్‌ పెద్దది. వీటిలో రెండు జాతులు ఉన్నాయి.
*ఇవి పిల్లల్ని కనడానికి మాత్రమే భూమి మీదకి వస్తాయి.
*ఒకసారి ఊపిరి పీల్చుకుంటే రెండు గంటలపాటు సముద్రంలో ఈదగలవు.
*చర్మం దళసరిగా ఉండడం వల్ల ఎంత చలినైనా తట్టుకోగలవు.
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, March 12, 2010

లాఫింగ్ బుద్ధ ఎందుకు , Laughing buddha story?




ఇంట్లో ఉంటే సుఖసంతోషాలు.. దుకాణంలో పెడితే వ్యాపారవృద్ధి.. అదృష్టాన్ని ఇచ్చే బొమ్మ.. దేశదేశాల్లో గిరాకీ.. అదే లాఫింగ్‌ బుద్ధా!

గుమ్మడికాయలాంటి గుండ్రటి తలకాయ. బానలాంటి పేద్ద బొజ్జ. ఎప్పుడూ సంతోషంగా కనిపించే ముఖం. చూస్తేనే నవ్వుపుట్టే ఆకారం. ఈ వర్ణనంతా ఎవరి గురించో తెలుసా? లాఫింగ్‌బుద్ధా. ఇతడి గురించి చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌లతో పాటు మన దేశంలో కూడా ఆసక్తి కరమైన కథలున్నాయి తెలుసా?

హ్యాపీ బుద్ధా, బుదాయి, కైసీ, మైత్రేయి ఇలా రకరకాల పేర్లు ఉండచ్చు కానీ దేశదేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోలెడంత గుర్తింపు. ఇంతకీ ఎవరితడు? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హొటై. సుమారు వెయ్యేళ్ల క్రితం నివసించిన బౌద్ధ బిక్షువు. భుజాన జోలె, చేతిలో బిక్షాపాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్ని మహిమలో. తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే కానీ, తెలిసిన వారికి ఆపద్బాంధవుడే. పేదవారికి, పిల్లలకి జోలె లోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడు. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు పంచి పెట్టినా జోలె ఖాళీ అయ్యేదే కాదు. అంటే అది అక్షయపాత్ర అన్నమాట. ఇతడిని చూసినవాళ్లకు ఆ రోజంతా హాయిగా, ఆనందంగా గడిచిపోయేదట.

ఇక జపాన్‌లో లాఫింగ్‌బుద్ధా ఏడుగురు అదృష్ట దేవతల్లో ఒకడు. మన దేశం కథల ప్రకారం చూస్తే సాక్షాత్తూ బోధిసత్త్వుడి అవతారమే. సంస్కృతంలో ఇతని పేరు మైత్రేయ. అంటే భవిష్యత్తు బుద్ధుడని అర్ధం. ఇతని విగ్రహం ఎక్కడుంటే అక్కడ సుఖసంతోషాలు, సిరిసంపదలు తులతూగుతాయనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.

థాయిలాండ్‌లో మరో చిత్రమైన కథ ఉంది. సంకాజాయ్‌ అనే ఓ సాధువు చాలా అందంగా ఉండేవాడట. ఇతడిని చూసి మగవాళ్ళు కూడా మైమరచిపోయేవారట. ఇది నచ్చని అతడు కావాలనే తన రూపాన్ని పెద్ద బొజ్జతో, లావుగా మార్చుకున్నాడని చెబుతారు. ఇతనికి ఆ దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. హొటెపై భలే నమ్మకాలున్నాయి తెలుసా? కుండలాంటి ఇతని పొట్ట మీద రాస్తే అదృష్టం వరిస్తుందంటారు. ఎందుకంటే సకల సిరిసంపదలన్నీ ఆ బొజ్జలోనే ఉన్నాయిట మరి. ఇక లాఫింగ్‌ బుద్ధా విగ్రహాల్లో ఎన్ని రకాలో. ఒకోదాని వెనక ఒకో నమ్మకం కనిపిస్తుంది.
మీకు తెలుసా?
అంతర్జాతీయ వేలంలో ఒక లాఫింగ్‌బుద్ధా బొమ్మ ఏకంగా 10 లక్షల డాలర్ల ధర పలికింది!
  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, March 11, 2010

పండ్ల రుచిలో రహస్యమేంటి?, Fruits Taste Secret?





ప్రశ్న: కొన్ని పండ్లు తియ్యగాను, కొన్ని పండ్లు పుల్లగాను ఉంటాయెందుకని?

జవాబు: రకరకాల పండ్లలో ఉండే రుచికి కారణం వాటిలోని రసాయనిక సంఘటనమే (chemical composition). ఒకే జాతి పండ్లయినా పచ్చిరంగులో ఉన్నప్పుడు ఒకలా, దోర దశలో ఒకలా, మిగుల ముగ్గినప్పుడు ఒకలా రుచించడానికి కారణం కూడా ఇదే. పండ్లలో చక్కెరల శాతం మిగిలిన పదార్థాల కన్నా ఎక్కువగా ఉంటే అవి తియ్యగా ఉంటాయి. ఆమ్ల గుణమున్న పదార్థాలు (సిట్రిక్‌ ఆమ్లం, లాక్టిక్‌ ఆమ్లం, ఆస్కార్బిక్‌ ఆమ్లం) ఎక్కువగా ఉంటే ఆ పండ్లు పుల్లగా ఉంటాయి. ఆల్కలాయిడ్లు, క్షార లక్షణాలు అధికంగా ఉండే పండ్లు వగరుగా అనిపిస్తాయి. ఆయా పండ్లలో రసాయనిక సంఘటన మీదనే రుచి, వాసన, రంగు, ఆహారపు విలువలు సైతం ఆధారపడి ఉంటాయి
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

విశ్వంలో పరిమాణాలెన్ని? , Universe measuremints





ప్రశ్న: విశ్వంలో ప్రస్తుతం ఉన్న పరిమాణాలు కాక వేరేవి ఉన్నాయా?

జవాబు: న్యూటన్‌ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని ప్రదేశానికి (space) పొడవు, వెడల్పు, ఎత్తు అనే మూడు పరిమాణాలుంటాయి. ఈ పరిమాణాలకు, కాల (time) పరిమాణానికి సంబంధం లేదు. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం ద్వారా విశ్వంలోని మూడు పరిమాణాలకు కాల పరిమాణాన్ని కూడా జతపరిచాడు. అంటే ఆయన సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని పరిమాణాలు నాలుగు. ఇక విశ్వంలో నాలుగు శక్తులుంటాయి. అవే గురుత్వ, విద్యుదయస్కాంత, దుర్బల, ప్రబల కేంద్రక శక్తులు. వీటిలో గురుత్వ శక్తి తప్ప మిగతా మూడూ కణ సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి. అంటే ఇవి విడివిడిగా ఉండే ప్యాకెట్ల (quantum)లాగా విశ్వంలో ఉంటే, గురుత్వ శక్తి మాత్రం ఖాళీ లేకుండా, అవిచ్ఛిన్నంగా (continuous)గా వ్యాపించి ఉంటుంది. ఈ నాలుగు శక్తులనూ ఒకే తాటి పైకి తేవడానికి 'స్ట్రింగ్‌ థియరీ'ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం 11 పరిమాణాలు ఉంటాయి. అయితే విశ్వంలోని నాలుగు పరిమాణాలకు అదనంగా ఉండే 7 పరిమాణాలు మన కంటికి కనబడని అత్యంత సూక్ష్మ ప్రదేశాలకే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకు సాలెగూడులోని పోగులు మన కంటికి ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. అదే మైక్రోస్కోపులో చూస్తే అవే పొడవు, వెడల్పు, లోతు అనే మూడు పరిమాణాల్లో కనిపిస్తాయి. అలాగే స్ట్రింగ్‌ సిద్ధాంతంలోని తంత్రులలో ఉండే పదకొండు పరిమాణాలు ఉన్నాయనడానికి ఖగోళ, కణ శాస్త్రవేత్తలు వాడే సున్నితమైన పరికరాల ద్వారా సాక్ష్యం లభిస్తుంది.
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కోకోనట్‌ క్రాబ్ కధేమిటి ? , Coconut Crab story ?




కొబ్బరి చెట్టు.. చకచకా ఎక్కేస్తుంది.. కొబ్బరి కాయను చీల్చి తినేస్తుంది.. ఏంటో తెలుసా? ఓ పీత! ప్రపంచంలోనే పెద్దది!!

ఓసారి పీతను తల్చుకోండి. ఎంతుంటుంది? మహా అయితే అరచెయ్యంత అనబోతున్నారా? అయితే ఆగండి. ఏకంగా ఆరడుగుల పొడవుండే పీత ఒకటుందని తెలుసా! అదే కోకోనట్‌ క్రాబ్‌. మరి పేరులో కొబ్బరెందుకో వూహించగలరా? ఈ మహా పీత గారు చకచకా కొబ్బరి చెట్టెక్కేసి, అక్కడున్న కాయని చీల్చి మరీ తినేస్తుంది. దీనికుండే పది కాళ్లలో ముందరుండే రెండూ బలంగా, పొడవుగా, కత్తెరలాంటి కొండెలతో ఉంటాయి. వాటితో ఇది పచ్చి కొబ్బరి కాయ లోపలి కంటా చిల్లు చేసి, అందులో గుజ్జునంతా జుర్రుకోగలదు.

కొబ్బరి చెట్లు పెరిగే సముద్ర తీర ప్రాంతాల్లోనే బతికే ఇవి ప్రపంచంలోనే పెద్ద పీతలు. అందుకే ఒకోటీ ఆరడుగుల పొడవుతో ఏకంగా 17 కిలోల బరవు వరకూ పెరుగుతాయి. అన్నట్టు.. దీనికి మరో పేరు కూడా ఉంది. అదేంటో తెలుసా? దొంగపీత! దీన్ని ఆయా ప్రాంతాల వారు రాబర్‌ క్రాబ్‌ (Robber Crab) అంటారు. ఎందుకో తెలుసా? ఇవి తీరం దగ్గరుండే ఇళ్లు, గుడారాలలోకి దూరి చిన్న కుండల్లాంటి మట్టి పాత్రల్ని, మెరిసే వెండి వస్తువుల్ని ఈడ్చుకుని పోతుంది. ఎందుకో ఎవరికీ తెలీదు. బహుశా తినేవనుకుంటుందో ఏమో!

రాత్రి మాత్రమే సంచరించే వీటి జీవనం కూడా చిత్రమే. ఆడ పీతలు సముద్రంలో గుడ్లు పెడితే, అవి నీటిలో లార్వాలుగా మారతాయి. ఆపై అవి నీటి అడుక్కి చేరి వేరే జీవుల గుల్లల్లో చేరతాయి. దానంత ఎదిగాక ఇంకా పెద్ద ఆల్చిప్పలాంటి గుల్లను ఎంచుకుంటాయి. ఇలా కొంత కాలం అయ్యాక ఇక పూర్తిగా భూమి మీదకి వచ్చేస్తాయి. ఒక దశ వచ్చాక వీటి మొప్పలు, ఊపిరితిత్తుల్లాగా పనిచేయడంతో ఇక నీటిలో శ్వాసించలేవు. భూమ్మీదకి వచ్చాక కొబ్బరి చిప్పల్ని మోసుకుంటూ కొన్నాళ్లు తిరుగుతాయి. శరీరం గట్టి పడ్డాక దాన్ని వదిలేసి చకచకా విహరిస్తాయి. తీరాల్లో బొరియలు చేసుకుని, అందులో కొబ్బరి పీచును పరుచుకుని కాలక్షేపం చేస్తుంటాయి. కేవలం కొబ్బరి గుజ్జునే కాకుండా పళ్లు, ఆకులు, తాబేళ్ల గుడ్లని కూడా లాగిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వీటిని వండుకుని తింటారు. వీటి ధర కూడా ఎక్కువే.

  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆ గుర్తు కథేంటి? , Ambulance sign Plus Story





ప్రశ్న: ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌ (+) గుర్తు ఉంటుంది కదా? దాని అర్థమేంటి?

జవాబు: తెల్లని నేపథ్యంలో ఎర్రని ప్లస్‌ గుర్తు ఉంటే అది అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ చిహ్నం. కొందరు ప్లస్‌ చుట్టూ గుండ్రని వలయం గీస్తారు. అప్పుడది రెడ్‌క్రాస్‌ చిహ్నం కాదు. నాలుగుసార్లు నోబెల్‌ శాంతి బహుమతి పొందిన రెడ్‌క్రాస్‌ సంస్థ, స్విట్జర్లాండ్‌ దేశస్థుడైన హెన్రీ డునాంట్‌ యుద్ధ సైనికులకు చికిత్స చేసే విధానాలపై రాసిన పుస్తకం ప్రేరణగా కొందరు 1863లో జెనీవాలో స్థాపించినది. అప్పట్లో తరచూ జరిగే యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవచేసే వారిని గుర్తించి, ఎవరూ దాడి చేయకుండా ఉండడానికి ఈ చిహ్నం ఉపయోగపడేది. అదే నేడు ఆరోగ్య రంగానికి చిహ్నంగా మారింది. వాస్తవానికి చట్టపరంగా రెడ్‌క్రాస్‌ సంస్థకు చెందని వారు ఈ చిహ్నాన్ని వాడకూడదు.

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పంక్చర్‌ గాలి చల్లనేల? , Air is cool from punctured Tube




ప్రశ్న: సైకిల్‌ ట్యూబ్‌ పంక్చర్‌ అయినప్పుడు అందులోంచి బయటకి వచ్చే గాలి ఎందుకు చల్లగా ఉంటుంది?

జవాబు: ఇందుకు కారణం వాయువుల ధర్మాలకు సంబంధించిన సూత్రం. ఎక్కువ పీడనంలో ఉన్న వాయువు అక్కడి నుంచి తక్కువ పీడనం ఉండే ప్రదేశానికి అతి సన్నని మార్గం ద్వారా ప్రవహించినప్పుడు ఆ వాయువు చల్లబడుతుంది. దీన్ని భౌతిక శాస్త్రంలో ఔల్‌-థామ్సన్‌ ఫలితం అంటారు. సైకిల్‌ ట్యూబ్‌ పంక్చర్‌ అయినప్పుడు ఇదే జరుగుతుంది. సైకిల్‌ టైరులో అమర్చిన ట్యూబ్‌లోకి ఎక్కించిన గాలి బయటి వాతావరణంలోని గాలితో పోలిస్తే, ఎక్కువ పీడనాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ట్యూబ్‌కు పంక్చర్‌ అయినప్పుడు, లోపల అధిక పీడనంతో ఉండే గాలి సన్నని రంధ్రం ద్వారా తక్కువ పీడనం ఉండే ప్రదేశానికి వస్తుంది. అలా రంధ్రం ద్వారా గాలి వేగంగా బయటకు రావడానికి ఆ వాయువ్యవస్థ కొంత పని చేయాల్సి ఉంటుంది. ఈ పని చేయడానికి కావలసిన శక్తి, బయటకి పోయే గాలిలో ఉండే ఉష్ణశక్తి నుంచి లభిస్తుంది. అందువల్ల ఉష్ణోగ్రత తగ్గి ఆ గాలి చల్లబడుతుంది.
  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, March 10, 2010

ఎర్రపీతల మహాప్రయాణం ఎందుకు , Red Crabs Journey


సముద్రంలో ఓ చిన్నదీవి.. మనుషుల జనాభా 1600.. ఎర్రపీతలు కూడా ఉంటాయి.. ఎన్నో తెలుసా? దాదాపు 15 కోట్లు! ఏటా ఇవి ఓ విన్యాసం చేస్తాయి.. అది ప్రపంచంలోనే అద్భుతమైనది!

లెఫ్ట్‌.. రైట్‌.. లెఫ్ట్‌.. రైట్‌..! సైనికులు ఒకే విధంగా కవాతు చేస్తుంటే ఎంత బాగుంటుందో కదూ? ఆ దీవిలో ఎర్రపీతలు కూడా ఇలాగే ఒకే లక్ష్యంతో బయల్దేరుతాయి. వాటి ప్రయాణం 'ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన వలస విన్యాసం'గా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఈ పీతల మహాప్రయాణం ఎక్కడికో తెలుసా? సముద్ర తీరానికి. అక్కడవి గుడ్లు పెడతాయి. ఒకో పీతా లక్ష వంతున!

ఇంతకీ ఆ దీవి ఎక్కడుందో తెలుసా? హిందూ మహాసముద్రంలో. పేరు క్రిస్‌మస్‌ దీవి. ఆస్ట్రేలియా ఆధీనంలో ఉండే దీని వైశాల్యం కేవలం 50 చదరపు మైళ్లు. ఈ దీవిలో జనాభా 1600 మందయితే, పీతల సంఖ్య 15 కోట్లు. అంటే పీతలన్నింటినీ మనుషులకు పంచిపెడితే ఒకొక్కక్కరికీ 93,750 పీతలొస్తాయన్నమాట! ఈ పీతలన్నీ ఆ దీవిలోని అడవుల్లో ఉంటాయి. నేలల్లో బొరియలు చేసుకుని ఆకులు, విత్తనాలు, పండ్లు తింటూ కాలక్షేపం చేస్తాయి. సరిగ్గా అక్టోబర్‌-నవంబర్‌ నెలల మధ్య ఏదో పనున్నట్టు బొరియల్లోంచి బిలబిలలాడుతూ బయల్దేరుతాయి. అక్కడి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరముండే సముద్ర తీరమే వాటి లక్ష్యం. ఆ ప్రయాణంలో అవి ఎత్తుపల్లాలు, ఇల్లు, భవనాలు, రోడ్లు, ఏవి అడ్డొచ్చినా ఆగవు. గునగునా.. చకచకా నడుస్తూ పోతాయి. ఆ సమయంలో ఆకాశంలోంచి చూస్తే ఎక్కడ చూసినా ఎర్ర తివాచీలు పరిచినట్టు కనిపిస్తుంది.

సముద్ర తీరానికి చేరుకోగానే ఏం చేస్తాయి? మగ పీతలు చకచకా బొరియలు చేస్తాయి. ఆడవి అందులో దూరుతాయి. అన్నీ జతకట్టాక ఆడవక్కడ ఉండిపోతే మగవి తిరిగి అడవుల్లోకి పోతాయి. ఆడ పీతలు సముద్ర జలాల్లో గుడ్లు పెట్టేసి వెనక్కి వచ్చేస్తాయి. ఆ గుడ్లు లార్వాలై, పిల్లలయ్యాక సుమారు 5 మిల్లీమీటర్లుండే ఆ బుల్లి ఎర్ర పీతలు కూడా అడవుల దిశగా పొలోమంటూ పోతాయి.

ఆ దీవిలో రెడ్‌క్రాబ్స్‌గా పిలిచే ఇవి సుమారు 40 మిల్లీమీటర్ల పరిమాణానికి ఎదుగుతాయి. వీటికి ఆ దీవిలో ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడిందిట. ఆఫ్రికాలో ఉండే ఎల్లోయాంట్స్‌ అనే చీమలు ఇక్కడికెలాగో వచ్చి చేరాయి. ఇవి పాపం.. ఈ ఎర్ర పీతలపై దాడి చేసి తినేస్తున్నాయి. ఇలా ఇవి ఇప్పటికే దాదాపు 2 కోట్ల పీతల్ని చంపేసినట్టు అంచనా. అక్కడి ప్రభుత్వం ఈ పీతల ప్రయాణానికి రోడ్ల కింద నుంచి సొరంగాలు తవ్వడం, రోడ్ల మీద వాహనాల రాకపోకలు రద్దు చేయడం లాంటి చర్యలు చేపడుతోంది.
  • ======================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
http://dr.seshagirirao.tripod.com/

పక్షులకు షాక్‌ కొట్టదా? ,Birds will not be shocked?


-


ప్రశ్న: కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. ఎందుకు?

జవాబు: ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభాలకు సాధారణంగా నాలుగు తీగలు ఉంటాయి. అందులో మూడు తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది. ఒక వ్యక్తిలోగానీ, వస్తువులో కానీ, జంతువులోగానీ విద్యుత్‌ ప్రవహించాలంటే దానికి అటూ ఇటూ విద్యుత్‌ పొటెన్షియల్‌ తేడా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి షాక్‌ కొట్టాలంటే ఏకకాలంలో కనీసం రెండు తీగలతో అనుసంధానం ఉండాలి. అప్పుడు అధిక పొటెన్షియల్‌ ఉన్న తీగలోకి, అల్ప పొటెన్షియల్‌ ఉన్న తీగ నుంచి ఎలక్ట్రాన్లు ఆ వ్యక్తి ద్వారా ప్రయాణిస్తాయి. ఇలా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తేనే ప్రమాదం. మనుషులు కూడా కేవలం ఒకే తీగను పట్టుకుని వేలాడితే ఏమీ కాదు. నేలను చెప్పుల్లేకుండా తాకితేనో, లేదా రెండు వైర్లను ఏకకాలంలో తగిలితేనో ప్రమాదం. పక్షుల విషయానికి వస్తే అవి ఒకే సమయంలో రెండు తీగలపై వాలవు. కాబట్టి వాటి దేహం ద్వారా విద్యుత్‌ ప్రవహించదు. పొరపాటున అది అటొక కాలు, ఇటొక కాలు ఒకేసారి పెడితే షాకుకి గురవుతుంది. ఇలాంటి సంఘటనలు కూడా అడపాదడపా జరుగుతూ ఉంటాయి.

  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సీ అర్చిన్‌ సంగతేమిటి ?, Sea Urchin Life




గుండె లేదు.. మెదడూ లేదు.. ఒళ్లంతా ముళ్లే.. కానీ 200 ఏళ్లు బతుకుతుంది! విడతకి 2 కోట్ల గుడ్లు పెడుతుంది! అదే సీ అర్చిన్‌ (సి ఉర్చిన్).. దీని గురించి ఇప్పుడు.. మరో కొత్త విషయం బయటపడింది!

సముద్రపు అట్టడుగున ఉండే దాన్ని అదాటుగా చూస్తే ముళ్లబంతిలా కనిపిస్తుంది. గుండ్రంగా ఉండే ఎడారి మొక్కలాంటిదేమో అనిపిస్తుంది. కానీ ఇదొక జీవి. సీ అర్చిన్‌ అనే ఈ జీవి వెన్నెముక లేని స్టార్‌ఫిష్‌ కుటుంబానికి చెందిదే. గుండె, మెదడు ఉండని దీనికి కళ్లు కూడా ఉండవని ఇన్నాళ్లూ అనుకున్నారు. కానీ తాజా పరిశోధనలో ఏం తేలిందో తెలుసా? దీని ముళ్లే కళ్లుగా పనిచేస్తాయని!

ఎక్కడో సముద్రం అడుగున పడి ఉండే దీని మీద ఎందుకు పరిశోధన చేస్తున్నారో తెలుసా? దీనికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. వందేళ్లు, రెండొందల ఏళ్లు కూడా బతికేసే వీటి ద్వారా మనకి ఉపయోగపడే మందుల్ని కనిపెట్టే అవకాశం ఉందన్నమాట.

సీ అర్చిన్లు భలే వింతగా ఉండే జీవులు. నలుపు, ఆకుపచ్చ, ఊదా, ఎరుపు రంగుల్లో ఉండే ఇవి ఏ రాయికో అంటిపెట్టుకుని కదలవు. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముళ్లమీదుగానే దొర్లుకుంటూ పోతాయి. వీటి నోరు శరీరం కింద ఉంటుంది. ఆ నోట్లో ఉండే అయిదు దంతాలతో ఇది సముద్రంలో ఉండే బండరాళ్ల మీద కూడా రంధ్రాలు చేయగలదు. దాదాపు 4 నుంచి 10 అంగుళాల పరిమాణం వరకూ ఉండే వీటి తిండి కూడా చిత్రమే. సముద్రపు మొక్కలు, జంతువుల అవశేషాలతో పాటు బురద, ఇసుక ఇలా ఏదైనా లాగించేయగలవు.

గుండ్రని శరీరం నుంచి అన్ని వైపులకీ పొడుచుకు వచ్చినట్టుండే ముళ్ల వల్లనే దీన్ని 'సముద్రపు ముళ్లపంది' అని కూడా పిలుస్తారు. శత్రువుల నుంచి కాపాడుకోడానికి దీనికి ముళ్లే రక్షణ కవచంలాగా ఉపయోగపడతాయి. ఈ ముళ్ల చివర్ల ద్వారానే ఇవి ఆ చుట్టుపక్కల ఉండే కాంతిని గ్రహించగలవని, తద్వారా పరిసరాలపై అవగాహన ఏర్పరచుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నింటిలో ఈ ముళ్లు విషపూరితం కూడా. ఇవి ఒకేసారి 2 కోట్ల గుడ్లు పెట్టగలవు. కొన్ని దేశాల్లో ఈ గుడ్లకు భలే గిరాకీ ఉంది.


  • ===================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

స్నైప్‌ ఈల్‌ చేప సంగతేమిటి ?, Snipe Eel fish story




తాడా? పామా? చేపా ?
తాడులాంటి రూపం.. అయిదడుగుల పొడవు.. బాతులాంటి ముక్కు.. ఈ వింత చేప పేరు.. స్నైప్‌ ఈల్‌

భూమ్మీద వెన్నెముక ఉన్న జీవుల గురించి తెలుసు కదా? ఆ వెన్నెముకలో వెన్నుపూసలుంటాయి కదా? మరి ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వెన్నుపూసలు కలిగి ఉండే జీవి ఏది? అదే స్నైప్‌ఈల్‌. దీనికి ఏకంగా 750 వెన్నుపూసలుంటాయి మరి. సముద్రంలో దాన్ని అదాటుగా చూస్తే ఏ దారమో, కొట్టుకు పోతున్నట్టు ఉంటుంది. పరీక్షగా చూస్తే అదో జలచరమని అర్థమవుతుంది. సన్నని పాములా కనిపించే దీన్ని అందుకే 'థ్రెడ్‌ ఫిష్‌' అని కూడా అంటారు. అంటే దారంచేపన్నమాట. ఇది ఈల్‌ చేపల కోవకే చెందినా, మిగతావాటి కన్నా భిన్నంగా ఉంటుంది.

ఇదెంత పొడవు పెరుగుతుందో తెలుసా? అయిదడుగులకు పైమాటే. దీని శరీరం వెడల్పుతో పోలిస్తే పొడవు 75 రెట్లు ఎక్కువగా ఉంటుంది. శరీరం కూడా చాలా మెత్తన. దీని నోరు భలే వింతగా ఉంటుంది. బాతు ముక్కులాగా ఉండే ఇది నోరు మూసుకుని ఉన్నా దవడలు కలవవు. ఎందుకంటే దవడలు రెండూ ఒకటి పైకి, ఒకటి కిందికి మెలి తిరిగినట్టు ఉంటాయి. అంటే నోరు మూసినా తెరిచినట్టే ఉంటుందన్నమాట. ఆ నోరుని బార్లా చాపి సముద్రంలో ఈదుతుంటే బుల్లి జలచరాలు దూరిపోతుంటాయి. అందినవి అందినట్టు గుటకాయ స్వాహా చేస్తూ ఇది ఈదుకుంటూ పోతుంటుంది. నోట్లో పళ్లు వెనక్కి ఉండడంతో ఓసారి చిక్కినది జారిపోవడం కష్టమే. అన్ని సముద్రాల్లోనూ దాదాపు 6000 అడుగుల లోతులో కాలక్షేపం చేసే ఇవి ఏకంగా పదేళ్లు బతుకుతాయి.
మీకు తెలుసా?
* ప్రపంచంలో మొత్తం 600 జాతుల ఈల్‌ చేపలు ఉన్నాయి.
* ఇవి ముందుకి, వెనక్కి కూడా ఈదగలవు.
* వీటిల్లో కొన్ని జాతుల చేపలు గుడ్లును పెట్టడానికి 4000 కిలోమీటర్ల దూరం వలస వెళతాయి.
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆ బిలాల రహస్యమేంటి? , Stars Life changes-Krishna bilam





ప్రశ్న: కృష్ణబిలాలంటే ఏమిటి? అవి ఎందుకు ఏర్పడతాయి?

జవాబు: నక్షత్రాల జీవితకాలంలో వివిధ దశలుంటాయి. వాటిలో కృష్ణబిలం (బ్లాక్‌హోల్‌) చివరిది. ఈ దశకు ముందు నక్షత్రం రెడ్‌ జెయింట్‌, వైట్‌డ్వార్ఫ్‌, సూపర్‌నోవా, న్యూట్రిన్‌ స్టార్‌ లాంటి మరికొన్ని దశలను దాటుతుంది.

ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న నక్షత్రాలు చివరి దశకు చేరుకున్నప్పుడు, వాటిలోని గురుత్వాకర్షణ బలాలు ఎక్కువైపోతాయి. దాంతో అవి తమ కేంద్రం వైపు కుంచించుకుపోతాయి. వాటి ద్రవ్య సాంద్రత (density) అనంతంగా పెరుగుతుంది. దీన్నే కృష్ణబిలం అంటారు. కృష్ణబిలంలో దేశ,కాలాలు (space, time) వాటంతట అవి మలుపుతిరిగి దాంట్లోకి కలిసిపోతాయి. కృష్ణబిలం మీద పడే ద్రవ్యం, కాంతి కూడా వెనక్కి తిరిగి రాలేవు. కాబట్టి వీటిని మనం చూడలేము.

సూర్యుని ద్రవ్యరాశి 2,000,000,000,000,000,000,000 (2 తర్వాత 21 సున్నాలు) టన్నులు! వ్యాసం 1,000,000 కిలోమీటర్లు. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ సుబ్రహ్మణ్యం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.4 రెట్లు ఎక్కువగా ఉండే నక్షత్రాలే కృష్ణబిలాలుగా మారతాయని సిద్ధాంతీకరించాడు. సూర్యుని కన్నా అంత పెద్దగా ఉండే ఓ నక్షత్రం కృష్ణబిలంగా మారితే దాని వ్యాసం కేవలం 2.9 కిలోమీటర్ల వరకూ కుంచించుకుపోతుంది. నక్షత్రాలే కాదు, ఏ వస్తువులోని ద్రవ్యరాశి అయినా కేంద్రంలోకి కుంచించుకుపోయి, సాంద్రత అనంతంగా పెరిగితే, అది కృష్ణబిలంగా మారుతుంది. మన భూమి బఠాణీ గింజ పరిమాణానికి కుంచించుకుపోతే, అది కూడా బ్లాక్‌హోల్‌ అయిపోతుంది!

  • ===================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

వెక్కిళ్లు ఎందుకొస్తాయి? , Hiccoughs for somebody Why?




ప్రశ్న: మనకు వెక్కిళ్లు ఎందుకు వస్తాయి?

జవాబు: మన దేహంలోని ఛాతీ, ఉదర భాగాల్ని వేరు చేసే పలుచని విభాజకం ఒకటుంటుంది. దీనిని ఉదర వితానం (diaphragm) అంటారు. ఇది కిందికి కదిలితే ఛాతీ ఎక్కువ గాలిని నింపుకుంటుంది. పై వైపు కదిలితే ఛాతీలోని కొంత గాలి బయటకు పోతుంది. మనం ప్రతిసారీ ముక్కు ద్వారా గాలిని పీల్చి, వదులుతున్నప్పుడు ఉదరవితానం కిందికీ పైకీ కదులుతూ ఉంటుంది. ఆ విధంగా మనం నిశ్శబ్దంగా శ్వాసిస్తూ ఉంటాం.

శ్వాసించడం అనేది లయబద్ధంగా జరిగే క్రమమైన ప్రక్రియ. కాబట్టి శ్వాసనాళిక లోపలికి, వెలుపలికి వచ్చే గాలి నిశ్శబ్దంగా స్వర పేటికలోకి ప్రవేశిస్తుంది. ఒకోసారి ఉదరవితానానికి అంటుకుని ఉండే నరం ఉత్తేజితమైతే ఉదరవితానం తటాలున కుంచించుకుపోయి కింది వైపు కదులుతుంది. అప్పుడు శ్వాసనాళం పై చివర అంటే స్వర పేటిక మూసుకోవడం మొదలవుతుంది. ఆ దశలో దాని ద్వారా హడావుడిగా వెలుపలికి పోయే గాలి, సీసా మూతిని బిగించిన రబ్బరు బిరడాను గబుక్కున లాగితే వచ్చే 'పక్‌' (యాక్‌) లాంటి శబ్దం చేస్తుంది. అలాంటి శబ్దాలు మధ్యమధ్య కొంత కాల వ్యవధిలో వరసగా వస్తాయి. అవే వెక్కిళ్లు. కారం ఎక్కువగా ఉండే మసాలా పదార్థాలు తినడం, కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడం, పేగులు సరిగా పనిచేయక పోవడం లాంటి కారణాల వల్ల ఉదరవితానానికి అంటుకుని ఉండే నరం ఉత్తేజితమై వెక్కిళ్లు వస్తాయి.
  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

వాహనాలకు నాలుగంకెలేల? , Vehicles have Four digit Numberplate Why?





ప్రశ్న: వాహనాల నెంబర్లు ఎప్పుడూ నాలుగేసి అంకెలతోనే ఉంటాయెందుకు? అంతకంటే ఎక్కువ అంకెలతో ఉండవేం?

జవాబు: వాహనాల రిజిస్ట్రేషన్‌ను నాలుగంకెలతో చేయడం ఒక ఆనవాయితీ (convention). అలాగే ఉండాలనడానికి విజ్ఞాన శాస్త్రపరమైన నియమం లేదు. గుర్తుపెట్టుకోడానికి సులువుగా ఉండడం కోసమే ఇలా చేస్తారు. అలా అయితే ఒక అంకె సరిపోతుంది కదా అనుకోకండి. ఎందుకంటే అలాంటప్పుడు ప్రతి 10 వాహనాల తర్వాత a,b,c,dలను ఆ అంకెలకు కలపాల్సి వస్తుంది. నాలుగు అంకెలతో నెంబర్లు ఉండడం వల్ల ప్రతి 10,000 వాహనాలకి ఓసారి అక్షరాలను జత చేసి ఇచ్చే వీలు ఉంటుంది. అయిదు లేదా ఆరు అంకెల సంఖ్యతో వాహనాలకు నెంబర్లు ఇస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాటిని గుర్తు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక వాహనందారుడు ప్రమాదకరమైన వేగంతో వెళ్లేప్పుడు, ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిపోతున్నప్పుడు దాన్ని ట్రాఫిక్‌ పోలీసులు చటుక్కున చూసి నెంబరును నోట్‌ చేసుకోవలసి వస్తుంది. అలాగే దుండగులు కిడ్నాప్‌ లాంటి నేరాలకు పాల్పడి వాహనాల్లో పారిపోయే సందర్భాల్లో ప్రత్యక్ష సాక్షులైన సామాన్యులు కూడా గుర్తు పెట్టుకోలేకపోతారు. ఈ కారణాల రీత్యా వాహనాల నెంబర్లకు నాలుగంకెలనే కేటాయించడం కొనసాగుతోంది.
  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, March 09, 2010

కుళాయి నీరు అలా పడుతుందేం? , TapWater flowing like stream why?





ప్రశ్న: కుళాయి నుంచి నీరు పడేప్పుడు పైనుంచి కిందకి వచ్చేకొద్దీ ధార సన్న బడుతుందేం?

జవాబు: కుళాయి నుంచి నీటి ధార పడుతున్నప్పుడు అది ముందు లావుగా ఉండి, రాన్రానూ సన్నబడుతూ త్రిభుజాకారంలో పడుతుంది. ఒక భౌతిక సూత్రం ప్రకారం నిలకడగా నిరంతరంగా నీరు పడుతున్నప్పుడు ఆ ప్రవాహంలో ఏ రెండు సమాన భాగాలను (cross section) తీసుకుని పరిశీలించినా వాటిలోని నీటి ఘనపరిమాణం సమానంగా ఒకే విలువ కలిగి స్థిరంగా ఉండాలి. కానీ కుళాయి నుంచి నీరు కిందకి పడేకొలదీ, భూమ్యాకర్షణ శక్తి వల్ల నీటి వేగం ఎక్కువవుతూ ఉంటుంది. అందువల్ల ఆ ధారలో ఒక భాగం నుంచి మరో భాగానికి వెళుతున్న కొద్దీ ఒక సెకనుకు ఎక్కువ నీరు ప్రవహించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆయా భాగాల్లో నీటి ఘనపరిమాణం సమానంగా ఉండాల్సి ఉంది కాబట్టి, నీరు కిందకి పడుతున్న కొలదీ అడ్డుకోత వైశాల్యం తగ్గుతుంది. అందువల్లనే మొదట్లో లావుగా ఉండే నీటి ధార కిందకి వచ్చేసరికి సన్నబడుతుంది.
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పాదరసం బంగారానికి అంటుకుంటుందా? , Mercury Stick to Gold?




ప్రశ్న: పాదరసం అంటిన చోట బంగారం తెల్లగా మారుతుంది, ఎందుకు? ఆ తెలుపును వదల్చడం ఎలా?

జవాబు: పాదరసంలో చాలా లోహాలు కరిగిపోతాయి. చక్కెర, ఉప్పులను నీటిలో వేస్తే కరిగిపోయినట్లు. చక్కెర, ఉప్పు బయట స్ఫటికరూపంలో అణువుల సముదాయంగా ఉన్నప్పటికీ, నీటిలో వేయగానే అవి విడివిడి అణువులుగా విడిపోతాయి. అలాగే పాదరసంలో బంగారాన్ని వేసినప్పుడు కూడా దాని పరమాణువులు విడిపోతాయి. ఒక్క బంగారమే కాదు, రాగి, జింకు కూడా పాదరసంలో కరిగిపోయి, అమాల్గములనే ద్రావణులను ఏర్పరుస్తాయి. అయితే ఒక బంగారు ఆభరణానికి కొద్దిగా పాదరసం అంటుకున్నప్పుడు మొత్తం బంగారాన్ని కరిగించే మోతాదు లేకపోవడం వల్ల అది తాకిన చోట మాత్రం అమాల్గము ఏర్పడుతుంది. పాదరసానికి గాలిలో స్థిరత్వం లేకపోవడం వల్ల బంగారానికి అంటుకున్న పాదరసపు పరమాణువులు గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి మెర్కురిక్‌ ఆక్సైడు అనే తెల్లని సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. అదే బంగారంపై ఏర్పడే తెల్లని మచ్చ. దాన్ని చెరపాలంటే మొదట స్టానస్‌ క్లోరైడు ద్రావణంలో ముంచిన దూదితో రుద్ది, ఆపై రాగి లేదా జింకు బిళ్లతో పదేపదే రుద్దితే అక్కడున్న పాదరస పరమాణువులు వైదొలగిపోతాయి.

  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, March 02, 2010

రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది ?, Remote Controle Working-How?





 Q : రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది ?, Remote Controle Working-How?

జవాబు:  టీవీలు, టేప్‌రికార్డర్లు, సీడీ ప్లేయర్లను మాత్రమే కాకుండా, కారు డోర్లను కూడా మనం కూర్చున్న చోట్లనుంచే కదలకుండా పని చేయించకలిగే సాధనమే 'రిమోట్‌ కంట్రోల్‌'. ఈ సాధనంలో వివిధ పనులు చేయడానికి కొన్ని బటన్లు ఉంటాయి. ఆ బటన్‌ నొక్కగానే అది చేయవలసిన పని పరారుణ కిరణాలుగా సంకేత రూపంలోకి మారుతుంది. ఆ కిరణాలు టీవీకి అమర్చిన బటన్లు అందుకుంటాయి. అప్పుడు ఆ బటన్‌ పనిచేసి మనం అనుకున్న మార్పులు జరుగుతాయి.

రిమోట్‌ కంట్రోల్‌ లోపల వెనుక భాగంలో ఒక విద్యుత్‌ వలయం, పలక (ఎలక్ట్రానిక్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు), బ్యాటరీ కనెక్షన్‌ ఉంటాయి. అక్కడ ఒక సమగ్రమైన వలయం (సర్క్యూట్‌) ఉంటుంది. దీనిని 'చిప్‌' అంటారు. చిప్‌కు కుడివైపున నలుపు రంగులో 'డయోడ్‌' (ట్రాన్సిస్టర్‌) ఉంటుంది. పసుపు రంగులో రెజోనేటర్‌, ఆకుపచ్చ రంగులో రెండు 'విద్యుత్‌ నిరోధకాలు', ముదురు నీలం రంగులో 'కెపాసిటర్‌' ఉంటాయి. బ్యాటరీలకు కలిపి ఆకుపచ్చరంగులో ఒక విద్యుత్‌ నిరోధకం, బ్రౌన్‌ రంగులో ఒక కెపాసిటర్‌ కూడా ఉంటాయి.

రిమోట్‌ కంట్రోల్‌ బటన్‌ను మనం నొక్కగానే ఆ విషయాన్ని 'చిప్‌' కనిపెడుతుంది. వెంటనే మనం నొక్కిన బటన్‌ ఏం కావాలనుకుంటుందో ఆ సూచనను మోర్స్‌కోడ్‌లాంటి సంకేతాలుగా మారుస్తుంది. ఒక్కొక్క బటన్‌కు వేర్వేరు సంకేతాలుంటాయి. చిప్‌ ఆ సంకేతాలను ట్రాన్సిస్టర్‌కు పంపిస్తుంది. ట్రాన్సిస్టర్‌ ఆ సంకేతాలను అర్థం చేసుకుని విడమరిచి దృఢ పరుస్తుంది. ఈ సంకేతాలు టీవీకి ఎదురుగా ఉండే రిమోట్‌ కంట్రోల్‌ చివరిభాగంలో ఉండే ఒక చిన్న బల్బు రూపంలో ఉన్న 'లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్‌'ను చేరుకుంటాయి.

ఈ డయోడ్‌ సంకేతాలను పరారుణ కాంతికిరణాలుగా మారుస్తుంది. ఈ కిరణాలు మన కంటికి కనబడవు. కానీ టీవీలో ఉండే గ్రాహకం వీటిని గ్రహిస్తుంది. ఈ కిరణాలు తెచ్చిన సంకేతాలను టీవీ వలయానికి అందిస్తుంది. సంకేతాలకు అనుగుణంగా టీవీ వలయం మార్పుచెంది మనం రిమోట్‌ కంట్రోల్‌తో చేయాలనుకున్న మార్పు టీవీలో కనిపిస్తుంది. 


  • =========================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, March 01, 2010

ఫ్యాను రెక్కలు మూడేల? , Fan has three wings Why?






ప్రశ్న: ఫ్యానుకు సాధారణంగా మూడు రెక్కలే ఉంటాయి. ఎందుకు?

- ధర్మాన లక్ష్మీ పావని, 8వ తరగతి, సెయింట్‌ ఏన్స్‌ కాన్వెంట్‌, పాతపట్నం (శ్రీకాకుళం)

జవాబు: ఫ్యానుకు ఒకే రెక్క ఉండడం వీలు కాదు కాబట్టి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగని రెక్కలు మరీ ఎక్కువయితే వాటి మధ్య ఎడం తక్కువైపోతుంది. ఫ్యాను చేసే పనే తన వెనుక గాలిని రెక్కల ద్వారా ముందుకు నెట్టడం. అలాంటప్పుడు రెక్కల మధ్య ఎడం తక్కువైతే గాలి త్వరితంగా ముందు వైపునకు రాలేదు. కాబట్టి మధ్యే మార్గంగా మూడు రెక్కలతో సర్దుకోవడం ఆనవాయితీ. పెద్దపెద్ద సభల్లోనూ, పెళ్లిపందిళ్లలోనూ తీవ్రమైన వేగంతో గాలిని దూరంగా నెట్టే తుపాన్‌ ఫ్యాన్లకు రెండే రెక్కలు ఉంటాయని గమనించండి. కొన్నిచోట్ల నాలుగు రెక్కల ఫ్యాన్లు కూడా ఉంటాయి. బాత్‌రూంలు, వంటగదులు వంటి గదుల్లోంచి అవాంఛనీయ వాయువుల్ని బయటికి నెట్టే (exhaust) ఫ్యాన్లకు ఐదు, లేదా ఆరు రెక్కలు కూడా ఉండడం కద్దు. సైద్ధాంతికంగా ఫ్యాను రెక్కలు ఒకటికన్నా ఎక్కువ ఉండాలన్నదే రూఢి అయిన విషయం. ఇక వేగం, అవసరాల ఆధారంగా రెక్కల సంఖ్య మారుతూ ఉంటుంది.




మూలము : ఈనాడు - -ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;
  • ================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.